భారత మాజీ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా దుబాయ్లో అత్యంత భయానకమైన రోజులను గడిపారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరగుతున్న యుద్ధం కారణంగా దుబాయ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తన కుమారుడు ఇజాన్తో కలిసి సానియా మీర్జా సురక్షితంగా హైదరాబాద్కు చేరుకున్నారు.
కళ్ల ముందే కూలిన శకలాలు
ప్రస్తుత పరిస్థితులపై సానియా మీర్జా స్పందిస్తూ.. తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు."మా ఇంటి పైనుంచే ఫైటర్ జెట్లు వెళ్లడం చూశాం. గాలిలోనే వాటిని అడ్డుకుంటున్న శబ్దాలు వినిపించాయి. మా ఇంటికి కేవలం 400-500 మీటర్ల దూరంలోనే క్షిపణి శకలాలు వచ్చి పడ్డాయి. ఆ దృశ్యాలు చూసినప్పుడు ఏ తల్లికైనా ఆందోళన కలగడం సహజం" అని సానియా ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారుడి ప్రశ్నలతో కలత..
సానియా తన కుమారుడు ఇజాన్ గురించి మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం పిల్లాడిపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించారు. "మా అబ్బాయి నన్ను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఆ పరిస్థితి పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. అక్కడ ఉండటం అసురక్షితమని నేను అనను కానీ, తీవ్రమైన అశాంతి, అనిశ్చితి నెలకొంది. అందుకే వెంటనే హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నాను" అని సానియా తెలిపారు.
హైదరాబాద్లో రంజాన్ వేడుకలు
ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తుండటంతో పండుగ కోసం సానియా తన పుట్టింటికి వచ్చారు. "ప్రతి ఏటా రంజాన్ చివరి వారం హైదరాబాద్లో గడపడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడి రంజాన్ వాతావరణం చాలా ప్రత్యేకం. నా కుమారుడికి తన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉండటం చాలా ఇష్టం" అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇజాన్ స్కూల్ సెలవుల్లో ఉన్నాడని, వచ్చే వారం నాటికి దుబాయ్లో పరిస్థితులు చక్కబడితేనే తిరిగి వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటానని సానియా స్పష్టం చేశారు.
దుబాయ్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చాలా మంది విదేశీయులు స్వదేశాలకు తిరుగుముఖం పడుతున్నారు. సానియా మీర్జా క్షేమంగా తిరిగి రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆమె ఆకాంక్షించారు.