ఐపీఎల్ 2026 ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఒకే ఒక్క హోమ్ మ్యాచ్ ఉండటం ఇబ్బంది కలింగిచే విషయమేనని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు గుజరాత్ టైటాన్స్కు కూడా ఒక్క హోమ్ మ్యాచ్ ఉందని తెలిపాడు.
ఐపీఎల్ 2026 షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 20 మ్యాచ్ల షెడ్యూల్నే వెల్లడించింది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) తలపడనుంది.
ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఆరెంజ్ ఆర్మీ మొత్తం 4 మ్యాచ్లు ఆడనుండగా.. ఇందులో ఒక్కటి మాత్రమే హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. అయితే ఈ టోర్నీ ఆరంభంలోనే ఎక్కువ మ్యాచ్లు ఇతర వేదికల్లో ఆడాల్సి రావడం సన్రైజర్స్ హైదరాబాద్కు సమస్యగా మారుతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ షెడ్యూల్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. సన్రైజర్స్ మ్యాచ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

'సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్కు అనుకూలించే ఫ్లాట్ పిచ్లు అవసరం. గత సీజన్లో సొంత మైదానంలో కూడా వారికి ఆశించిన పిచ్లు దక్కలేదు. ఈ సారి పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఆరంభంలో కేవలం ఒకే ఒక మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. హైదరాబాద్ దూకుడుగా సీజన్ ప్రారంభించాలంటే మంచి బ్యాటింగ్ పిచ్ అవసరం. చిన్నస్వామిలో ఆ అవకాశం ఉంటుంది. కానీ, మొదటి నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ హైదరాబాద్లో జరగడం.. అది కూడా మధ్యాహ్నం మ్యాచ్ కావడం ఆ జట్టుకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.
ఒకవేళ ఆరంభంలో బయట మైదానాల్లో జరిగిన మ్యాచ్ల్లో హైదరాబాద్ రెండు విజయాలు సాధిస్తే.. ఆ తర్వాత వరుసగా హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్లు వారికి ప్లస్ అవుతాయి. ఒకసారి ఊపు అందుకుంటే ప్లే-ఆఫ్స్కు వెళ్లడం సులవవుతుంది. కానీ ఆరంభంలో అవే మ్యాచ్ల్లో ఓడితే.. ఆ తర్వాత హోమ్ గ్రౌండ్లో కూడా ఒత్తిడి పెరిగి అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
గుజరాత్ జట్టుకు కూడా ఆరంభంలో ఒకే ఒక హోమ్ మ్యాచ్ ఉంది. అయితే ఆ మ్యాచ్ సాయంత్రం ఉండటం వారికి కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే మధ్యాహ్నం మ్యాచ్ల్లో పిచ్లు బ్యాటింగ్కు అంతగా సహకరించవు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.