
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వృద్దీమాన్ సాహాను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా అతనికి జరిపిన పరీక్షల్లో మళ్లీ పాజిటీవే వచ్చింది.
ఐపీఎల్ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్.. రెండు వారాల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు.
అయినప్పటికీ.. రెండోసారి నిర్వహించిన టెస్ట్లోనూ అతనికి వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో సాహా ఢిల్లీలోని హోటల్ గదికే పరిమితమయ్యాడు. త్వరలోనే మరో విడత పరీక్షలు చేయనున్నారు. సోమవారం నాటికి క్వారంటైన్ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ప్రకటించిన 24 మందితో కూడిన భారత జంబో జట్టులో సాహాకు చోటు దక్కింది. ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఆ సమయానికి సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే.. డబ్ల్యూటీసీ మ్యాచ్లో ఆడతాడు.
లేకుంటే భారత్లోనే ఉండిపోతాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఏ ఆటగాడైనా.. కరోనా బారిన పడితే ఇక్కడే వదిలేసి వెళ్తామని, వారి ఒక్కరి కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయలేమని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇటీవలే ఓ చానెల్తో మాట్లాడిన సాహా.. ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. కరోనా పాజిటివ్ అని తెలియగానే తాను వణికిపోయానని, తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారన్నాడు. 'కరోనా పాజిటివ్గా తేలగానే చాలా భయపడిపోయా. నేనే కాదు.. నా ఫ్యామిలీ మొత్తం ఆందోళనకి గురయ్యారు. అది తెలిసి నేనే నా ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి వారికి నా ఆరోగ్యం బాగానే ఉందని.. మీరు ఆందోళన చెందొద్దని చెప్పాను.
కాగా ఐపీఎల్ సందర్భంగా ప్రాక్టీస్ ముగించుకుని హోటల్కి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు రావడంతో టీమ్ డాక్టర్కి సమాచారం అందించాను. ఆరోజే క్వారంటైన్లో ఉంచి.. నాకు కరోనా పరీక్ష చేశారు. వెంటనే నన్ను ఐసోలేషన్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది' అని చెప్పుకొచ్చాడు.