‘మా మెడికల్ పాలసీ పని చేస్తుందా'
'అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కానీ వైరస్ ఎలా బబుల్లోకి వచ్చిందో తెలీదు. ఒక్కసారి కరోనా సహచరుడికి వచ్చిందని తెలిశాక ఆటగాళ్లంతా భయపడిపోయారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు అప్పటికే ఇక్కడి పరిస్థితులు, ఆక్సిజన్ సమస్యలు, బెడ్లు లేకపోవడంలాంటి వార్తలు చదివి ఉండటంతో మరింత బెంగ పెరిగిపోయింది. కొందరు క్రికెటర్లయితే నాకు ఇక్కడ కోవిడ్ వస్తే పరిస్థితి ఏమిటి. నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ భారత్లో పని చేస్తుందా అని కూడా అడిగేశారు' అని గోస్వామి వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే లీగ్ వాయిదా ప్రకటనకు ముందు క్రికెటర్లలో ఎంతటి అభద్రతా భావం నెలకొందో అర్థమవుతుంది.
కుటుంబ సభ్యులకు సొకితే..
క్రీడాకారులుగా తమకు రోగనిరోధశక్తి బాగానే ఉంటుందని, వైరస్ సోకినా త్వరగానే కోలుకుంటామన్నాడు. కానీ లక్షణాలు లేకుండా వైరస్ను ఇంటికి తీసుకెళ్లి వృద్దులైన తమ కుటుంబ సభ్యులకు అంటిస్తే పరిస్థితి ఏంటి? వాళ్లు తట్టుకొని కోలుకోగలుగుతారా? అనే ఆందోళన ప్రతీ ఆటగాడిలో నెలకొందని గోస్వామి చెప్పుకొచ్చాడు. తమ వల్ల కుటుంబాన్ని రిస్క్లో పెట్టడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారని తెలిపాడు. బయోబబుల్లో ఉండటం కష్టమని, నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్లు, సినిమాలు చూడటమే ఏకైక మార్గామన్నాడు. అలా కాదని ఖాళీగా ఉంటే ప్రతీకూల ఆలోచనలతో ఆందోళనకు గురికావాల్సి వస్తుందన్నాడు.
బాల్కానీ దొరికే అదృష్టవంతుడు..
'ఐసోలేషన్, క్వారంటైన్ కూడా చాలా కష్టం. ఆ 10 రోజులు ఓ నెలలా అనిపిస్తుంది. నీకిచ్చిన హోటల్ రూమ్కు బాల్కానీ ఉంటే నీవు చాలా అదృష్టవంతుడివి. కనీసం సూర్యోదయాన్ని, సూర్యస్తమయాన్నైనా ఆస్వాదించవచ్చు.'అని గోస్వామి చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారి కట్టడికై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా గోస్వామి తన వంతు సాయం చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు అల్లాడుతున్న సమయంలో.. ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
సాహాకు కరోనా ఎలా వచ్చిందో?
అన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని ఆ టీమ్ మెంటార్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. సన్రైజర్స్ టీమ్ యాజమాన్యం కూడా ఇప్పటికీ అదే షాక్లో ఉందని వెల్లడించాడు. ఇంత కఠినమైన బబుల్ను కూడా ఛేదించి వచ్చిందంటే కరోనాపై పోరులో ఇది తమకు ఓ గుణపాఠం లాంటిదని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ అభిప్రాయపడ్డాడు. పలు జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ను బీసీసీఐ మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.