దుబాయ్: ఐపీఎల్ 2020 జర్నీని సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాపార్డర్ రాణించినా.. మిడిలార్డర్, లోయరార్డర్ కట్టకట్టుకొని విఫలమవడంతోనే గెలిచే మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీంతో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ సారథిని కేన్ విలియమ్సన్, అఫ్గాన్ సంచలనం మహ్మద్ నబీని తుది జట్టులో తీసుకోకపోవడాన్ని కూడా విశ్లేషకులు తప్పుబట్టారు.
అయితే వీటన్నికి సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో సమాధానమిచ్చాడు. మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కేన్ విలియమ్సన్ గాయపడ్డాడని, అతని తొడ కండరాలు పట్టేసాయని తెలిపాడు. దాంతోనే అతన్ని తుది జట్టులోకి తీసుకోలేకపోయామని చెప్పాడు. అలాగే పిచ్ పరిస్థితుల కారణంగా ఓ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలని భావించి మిచెల్ మార్ష్ను ఎంపికచేశామని స్పష్టం చేశాడు.
'కేన్ విలియమ్సన్ ఫిట్గా లేకపోవడంతోనే తుది జట్టులోకి తీసుకోలేదు. ప్రాక్టీస్ సెషన్లో అతని తొడ కండరాలు పట్టేసాయి. ముందుగా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకున్నాం. పిచ్ పరిస్థితి దృష్ట్యా చేజింగ్లో ఇబ్బందవుతుందనే బౌలింగ్ ఆల్రౌండర్ మిచెట్ మార్ష్ను తీసుకున్నాం. కానీ అతను ఆరంభంలోనే గాయపడటం మమ్మల్ని నిరాశపర్చింది. గాయంతో కూడా బ్యాటింగ్ చేసిన అతనికి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కనీసం నిలబడలేని స్థితిలో జట్టు కోసం సాహసం చేశాడు.
అలాగే నేను ఔటైన విధానాన్ని కూడా అసలు ఏమాత్రం ఊహించలేదు. ఈ మ్యాచ్ మాకు కలిసి రాలేదు. నా రనౌట్, ప్రియామ్ గార్గ్ ర్యాంప్ షాట్కు యత్నించగా.. బంతి హెల్మెట్కు తగిలి వికెట్లకు తాకడం, మిచెల్ మార్ష్ గాయం విస్మయ పరిచాయి. ఇక ఆర్సీబీ కూడా అద్భుతంగా ఆడింది. మొత్తానికి ఈ మ్యాచ్ను మా నుంచి లాక్కెళ్లింది మాత్రం చాహలే. అతనే మ్యాచ్ విన్నర్'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. పడిక్కల్, ఏబీడి హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆరోన్ ఫించ్(27 బంతుల్లో 29) ఫర్వాలేదనపించాడు. విరాట్ కోహ్లీ(14) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. సన్రైజర్స్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.
అనంతరం చేజింగ్కు దిగిన సన్రైజర్స్ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. బెయిర్స్టో(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) ఉన్నంతసేపు బెంబేలెత్తించినా ఫలితం లేకపోయింది. డేవిడ్ వార్నర్(6) అన్లక్కీ రనౌట్ కాగా.. మనీష్ పాండే(34) ఫర్వాలేదనపించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో చాహల్(3/18) ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించగా.. నవదీప్ సైనీ, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీశారు. డేల్ స్టెయిన్కు ఒక వికెట్ దక్కింది. విజయంలో కీలకపాత్ర పోషించిన చాహల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
సౌరవ్ గంగూలీని ఇరుకునపడేసిన శ్రేయస్ అయ్యర్.. తీవ్ర దుమారం!