ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్కు మరో పరాజయం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను స్వీయ తప్పిదాలతో కేకేఆర్ చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయాడు. సహచర బ్యాట్స్మన్ వెంకటేశ్ అయ్యర్ చేసిన పనికి చిర్రెత్తుకుపోయిన శ్రేయస్.. అతన్ని బండ బూతులు తిట్టాడు.
అసలేం జరిగిందంటే..? ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ రనౌటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఆ ఓవర్ చివరి బంతిని బౌల్ట్ ఫుల్లర్ లెంగ్త్గా వేయగా... వెంకటేశ్ అయ్యర్ డీప్ కవర్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హెట్ మైర్ బంతిని వేగంగా అందుకొని కీపర్కు విసిరాడు. అయితే అప్పటికే సింగిల్ తీసిన శ్రేయస్.. క్విక్ డబుల్ కోసం ప్రయత్నించాడు. వెంకటేశ్ సైతం లేట్గా రెస్పాండ్ అవ్వడంతో అయ్యర్ ఆగ్రహానికి గురయ్యాడు. బండ బూతులతో అతన్ని మందలించాడు. వెంకటేశ్ అయ్యర్తో సమన్వయ లోపం కారణంగా ఈ తప్పిదం చోటు చేసుకుంది.
— Addicric (@addicric) April 18, 2022
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 103) శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) షిమ్రన్ హెట్మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.