ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్న తరుణంలో టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. పేలవ ఫామ్తో జట్టుకు దూరమైన మాలిక్ చివరిగా వన్డే వరల్డ్ కప్లో ఆడాడు. బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆ దేశ సెలక్టర్లు గురువారం ప్రకటించారు. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లతో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్స్ హారిస్ రౌఫ్, అహ్సన్ అలీలకు అవకాశం కల్పించారు. అయితే మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్లకు మాత్రం చోటుదక్కలేదు.
పాక్ క్రికెట్ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. 'వరల్డ్ నెం.1 జట్టుగా మేం ఆడిని చివరి 9 టీ20 మ్యాచ్ల్లో 8 ఓడిపోయాం. ఇది ఏమాత్రం ఆమోదించదగినది కాదు. మా ఓటముల పరంపరకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అప్ కమింగ్ ఆసియా కప్తో పాటు ప్రపంచకప్ గెలిచే జట్టును సిద్ధం చేస్తున్నాం. దీనికి మేం తీసుకుబోయే నిర్ణయాలు కీలక పాత్రవహించనున్నాయి. అనుభవం, యువ ఆటగాళ్లతో ప్రత్యేక కాంబినేషన్స్ సిద్ధం చేస్తున్నాం. మాలిక్, హఫీజ్లు అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది'అని మిస్బా తెలిపాడు. ఇక జనవరి 24న లాహోర్లో జరిగే మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభంకానుంది.
పాకిస్తాన్ టీ20 జట్టు:
బాబర్ అజమ్(సారథి), అహ్సన్ అలీ, అమద్ బట్, హారీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీమ్, కౌష్దిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, ముసా ఖాన్, షాదాబ్ ఖాన్, షహీన్ షా ఆఫ్రిది, షోయబ్ మాలిక్, ఉస్మాన్ ఖాదిర్.