నేను ఆ మ్యాచ్ ఆడుంటే భారత్ ప్రపంచకప్ గెలిచేదే కాదు: షోయబ్ అక్తర్

కరాచీ: 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో తాను ఆడుంటే టీమిండియా ఆ టోర్నీలో విజేతగా నిలిచేది కాదని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఆ టోర్నీ సెమీ ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. మొహాలీ వేదికగా జరిగిన ఈ హైటెన్షన్ మ్యాచ్లో పాక్ను ఓడించి భారత్ ఫైనల్ చేరింది. ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించి 28 ఏళ్ల కలను సాకారం చేస్తూ రెండోసారి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడింది. అయితే నాటి సెమీఫైనల్ మ్యాచ్లో అక్తర్ ఆడలేదు. ఫిట్గా లేడని అతన్ని పక్కనపెట్టారు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాటి సెమీఫైనల్ ఆడుంటే భారత్ తక్కువ స్కోర్కే పరిమితమయ్యేదన్నాడు.

నేను ఆడుంటే..
'మొహాలీ జ్ఞాపకాలు నన్ను తీవ్రంగా వెంటాడుతున్నాయి. 2011 వరల్డ్ కప్ సెమీస్లో నేను ఆడి ఉండాల్సింది. కానీ మా టీమ్మేనేజ్మెంట్ నేను మ్యాచ్కు ఫిట్గా లేనని నన్ను పక్కనబెట్టింది. ఇది దారుణం. నేను భారత్ ను ఓడించి పాక్ ను వాంఖెడే (పైనల్ జరిగిన స్టేడియం) కు తీసుకెళ్లాలని భావించా. స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దేశ ప్రజలు, మీడియా అంతా మ్యాచ్ గురించే మాట్లాడుకుంటారు. అసలు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో మాపై ఒత్తిడి లేదు.

సచిన్ను త్వరగా ఔట్ చేసేవాడిని..
ఆ మ్యాచ్ లో గనక నేను ఆడి ఉంటే సచిన్, సెహ్వాగ్లను ముందే ఔట్ చేసేవాడిని. దాంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ ను ఈజీగా నెగ్గేవాళ్లం. ఆ మ్యాచ్లో నన్ను డగౌట్ లో కూర్చోబెట్టి పాక్ ఓడిపోతుంటే చూడటం నేను తట్టుకోలేకపోయా. అంత కీలక మ్యాచ్ లో ఓడితే చాలా మంది ఏడుస్తారు. కానీ నేను అలా కాదు. ఏడ్వడం కంటే నా చుట్టు పక్కల ఉన్న వస్తువులను పగలగొడతా. మేం ఓడిపోతున్నప్పుడు కూడా చాలా వస్తువులు పగలగొట్టా. నేను చాలా నిరాశకు గురయ్యా. ఆ వేదన ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

భారత్ సునాయస విజయం..
నాటి సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) రాణించారు. పాక్ తరఫున వహాబ్ రియాజ్ 5 వికెట్లు తీశాడు. అయితే లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. మిస్బా ఉల్ హక్ (56), మహ్మద్ హఫీజ్ (43)లు పోరాడిన ఫలితం లేకపోయింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి తలా రెండు వికెట్లు తీసి భారత్కు విజయాన్ని అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications