క్రికెట్ మాత్రం ఆడకూడదా?
భారత్-పాక్లు వాణిజ్య పరంగా కలిసున్నప్పుడు, కబడ్డీ, డేవిస్ కప్ ఆడినప్పుడు.. క్రికెట్కు ఏమైందని షోయబ్ ప్రశ్నించాడు. ' రెండు దేశాలు వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాయి. కబడ్డీ, డేవిస్ కప్ కూడా ఆడుతాయి. అలాంటప్పుడు క్రికెట్కు ఏమైంది? భారత్.. పాకిస్థాన్కు రాలేదని, పాక్.. భారత్కు వెళ్లలేదని నాకు తెలుసు. కానీ ఇరు దేశాలు తటస్థ వేదికలపై ఆసియా కప్, చాంపియన్స్ట్రోఫీలు ఆడుతున్నాయి. అలాగే ద్వైపాక్షిక సిరీస్లు కూడా తటస్థ వేదికలపై ఎందుకు ఆడకూడదు?'అని అక్తర్ ప్రశ్నించాడు.
క్రికెట్ ఎఫెక్ట్ కావద్దు..
ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలతో క్రికెట్ ఎఫెక్ట్ కావద్దని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రపంచంలోనే అత్యత్తమ ఆతిథ్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. సెహ్వాగ్, గంగూలీ, సచిన్లను అడగండి. మేం వారిపై ఎంత ప్రేమ చూపించామో. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాల వల్ల క్రికెట్ ప్రభావితం కాకూడదు. త్వరలోనే ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్లు జరుగుతాయని ఆశిస్తున్నా. దాని వల్ల ఇరుదేశాల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. 'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
అన్ని బంధాలు తెంచుకోండి..
ఇరుదేశాల మధ్య క్రికెట్ కుదరకపోతే అన్ని బంధాలు తెంచుకోవాలని అక్తర్ డిమాండ్ చేశాడు. ‘భారత్, పాక్లు క్రికెట్ ఆడటం కుదరకపోతే.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలతో పాటు కబడ్డీ, ఇతర ఆటలు కూడా రద్దు చేయాలి. వీటన్నింటిపై అభ్యంతరం తలెత్తదు. కానీ క్రికెట్ అంశం తెరపైకి వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మొదలవుతాయి. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు జరగడం ఎంతో అవసరం. ఈ సిరీస్ల వల్ల ఆదాయం రావడంతో పాటు.. ఒత్తిడిని జయించే కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వస్తారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్దరణకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నా.'అని అక్తర్ విజ్ఞప్తి చేశాడు.
యువరాజ్ కూడా..
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సైతం భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలన్నాడు. '2004, 2006, 2008 పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడే పరిస్థితులు ఉన్నాయి. కానీ.. అది మన చేతిలో లేదు. మనందరం క్రికెట్ను ప్రేమిస్తాం. కానీ.. మన ప్రత్యర్థులు ఎవరు అనేది మనం నిర్ణయించలేం. అయితే దాయాదుల మధ్య మ్యాచ్ జరిగితే అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుంది' అని యువీ అభిప్రాయపడ్డాడు.
ఇక ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ మినహా మరెక్కడా ఇరు దేశాలు క్రికెట్ ఆడటం లేదు. చివరిసారిగా 2012-13లో భారత్, పాక్ మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఇక టెస్ట్ సిరీస్ అయితే 2007లో జరిగింది.