ముంబై: హర్ధిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడం తన లక్ష్యం కాదని,మెరుగైన ప్రదర్శనతో భారత జట్టును గెలిపించడమే తన కర్తవ్యమని యువ ఆల్రౌండర్ శివం దూబే తెలిపాడు.
భారత జట్టులో ఆల్రౌండర్ స్థానం కోసం హార్దిక్ పాండ్య, శివమ్ దూబే మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబరులో గాయపడిన హార్దిక్ పాండ్య.. వెన్ను సర్జరీతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో అవకాశం దక్కించుకున్న శివమ్ దూబే.. భారత్ తరఫున వరుస మ్యాచ్లు ఆడాడు.
కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్తో ఒక్క హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. ఇక ఇటీవల ఫిట్నెస్ సాధించిన హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో.. సెలెక్టర్లు దూబేపై వేటు వేసారు. సౌతాఫ్రికా టూర్కు పాండ్యాను ఎంపిక చేశారు.
టీమిండియాలో చోటుపై తాజాగా శివమ్ దూబే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అందరూ నన్ను హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడిగా చూస్తున్నారు. కానీ.. నేను జట్టులో అతని స్థానాన్ని రీప్లేస్ చేయలనుకోవడం లేదు. మెరుగైన ప్రదర్శనతో భారత్ జట్టుని గెలిపించడమే నా లక్ష్యం. హార్దిక్ పాండ్యా టీమ్లో సీనియర్ ప్లేయరే కాకుండా కీలక ఆటగాడు. ఒకవేళ అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. జట్టులో అతని స్థానానికి డోకా ఉండదు' అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు.
ముంబై వేదికగా ఇటీవల జరిగిన డీవై పాటిల్ టీ20 కప్లో హర్ధిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో రెండు సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక సౌతాఫ్రికాతో అంతర్జాతీయ క్రికెట్లోకి ఘనంగా పునరాగమనం ఇవ్వాలనుకున్న ఈ స్టార్ ఆల్రౌండర్కు కరోనా గట్టి షాకిచ్చింది. ఈ ప్రాణాంతక వైరస్తో ఈ సిరీస్ రద్దవ్వడంతో పాండ్యా ఆశలు ఆవిరయ్యాయి. అతని మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.