న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. శ్రీలంకతో నేటి(బుధవారం) రాత్రి జరగనున్న రెండో టీ20లో భారత కెప్టెన్ శిఖర్ ధావన్ బరిలోకి దిగనున్నాడు. అతనికి కరోనా పాజిటీవ్ అని, ఐసోలేషన్కు తరలించారనే వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది. ఇక టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా మంగళవారం కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. రెండో టీ20 మరికొన్ని గంటల్లో ఆరంభమవుతుందనగా కృనాల్కు కోవిడ్-19 అని తేలడంతో మ్యాచ్ నేటి(బుధవారం)కి వాయిదా పడింది. ఇక కృనాల్కు పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి ఈ సిరీస్కు సంబంధించిన నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంటకో అప్డేట్ అభిమానులను ఆందోళన పరుస్తోంది.
కృనాల్తో ఎనిమిది మంది క్రికెటర్లు సన్నిహితంగా మెలిగినట్లు భారత మెడికల్ టీమ్ గుర్తించింది. వీరికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అంద రికీ నెగెటివ్గా రిపోర్టు వచ్చింది. అయితే ముదస్తు చర్యల్లో భాగంగా వీరిని కూడా ఐసోలేషన్కు తరలించారని, మిగిలిన రెండు మ్యాచులకు అందుబాటులో ఉండటం కష్టమేనని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎనిమిది మందిలో కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడని, దాంతో తదుపరి రెండు మ్యాచ్ల్లో భువనేశ్వర్ కుమార్ జట్టును నడిపిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదని క్రిక్ బజ్ పేర్కొంది. శిఖర్ ధావన్ పూర్తి ఫిట్గా ఉన్నాడని నేడు జరిగే మ్యాచ్లో బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయని తెలిపింది. కృనాల్కు సన్నిహితంగా ఉన్నవారిలో శిఖర్ ధావన్ లేడని, కృనాల్తో పాటు అతనికి సన్నిహితంగా ఉన్న ఎనిమింది ఆటగాళ్లను జట్టుకు దూరంగా ఐసోలేషన్కు తరలించారని పేర్కొంది.
ఇక నెట్ బౌలర్లుగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్దీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్లను జట్టుతో కలవనున్నారని టీమ్ అధికారి ఒకరు తెలిపారు. చివరి రెండు మ్యాచ్లకు మొత్తం 9 మంది ఆటగాళ్లు దూరం కానున్నారని తెలుస్తోంది. బయటికి చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నా.. టీమ్మేనేజ్మెంట్ మాత్రం గోప్యంగా ఉంచుతుంది. మ్యాచ్ ప్రారంభ సమయంలోనే వారెవరా? అనేదానిపై క్లారిటీ రానుంది.