హైదరాబాద్: టీమిండియా తుది ఎంపికలో బీసీసీఐ సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటున్నాడా? గుజరాత్ ఆటగాళ్లకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నాడా? అంటే సోషల్ మీడియా అవుననే సమాధానం చెబుతోంది. ఈ మాటలు అంటుంది కేవలం ఆకతాయి అభిమానులే కాదు.. క్రికెట్ విశ్లేషకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దిగ్గజాలు సైతం ఈ ఆరోపణలు చేస్తున్నారు.
బంగ్లాదేశ్తో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టి జయదేవ్ ఉనాద్కత్ను తీసుకోవడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకున్నప్పుడు రెగ్యూల్ పేస్ ఆల్రౌండర్ అయిన శార్దూల్ ఠాకూర్ ఆడించకుండా గుజరాత్ ప్లేయర్ అయిన జయదేవ్ ఉనాద్కత్ను ఆడించాల్సిన అవసరం ఏం ఉందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) December 23, 2022
జై షా ఆదేశాలతోనే ఈ మార్పు చేశారని స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. అయితే శార్దూల్ ఠాకూర్కు మద్దతుగా.. టీమిండియాలో రాజకీయాలున్నాయని కొందరు అభిమానులు ట్వీట్లు చేశారు. శార్దూల్ జట్టులో ఉండాల్సిందని, గుజరాత్ రాజకీయాలకు బలి చేస్తున్నారని మండిపడ్డారు. శార్డూల్ రంజీ ట్రోఫీలు ఆడుకోవడం ఉత్తమమని సూచించారు. అయితే ఈ ట్వీట్లను శార్దూల్ ఠాకూర్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.
కుల్దీప్ యాదవ్ను కాదని జయదేవ్ ఉనద్కత్ను ఎంచుకోవడంపై ఓ వైపు చర్చ జరుగుతుండగా, ఇలా శార్దూల్ విషయం సోషల్ మీడియాకి ఎక్కడంతో 'టీమిండియాలో ఏమవుతోంది' అనే చర్చ ఊపందుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లోకి 2018లో అరంగేట్రం చేసిన శార్దూల్ కేవలం 8 టెస్టులు మాత్రమే ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్ల రాకతో తుది జట్టులోకి శార్దూల్ రావడం గగనంగా మారింది. తాజాగా బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.