
జోహన్నెస్బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ 5 వికెట్లతో చెలరేగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఫస్ట్ సెషన్లో క్రీజులో కుదురుకున్న డీన్ ఎల్గర్(28), హాఫ్ సెంచరీ హీరో పీటర్సన్(62), డస్సెన్(1)లను 12 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేర్చి టీమిండియాను రేసులో నిలిపిన ఠాకూర్.. బ్రేక్ అనంతరం హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన టెంబా బవుమా(51), కైల్ వెర్నన్(21)లను ఔట్ చేసి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. తద్వారా భారత దిగ్గజాల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వాండరర్స్ వేదికగా ఈ ఘనతను అందుకున్న ఆరో భారత బౌలర్గా గుర్తింపు పొందాడు. ఠాకూర్ కన్నా ముందు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఠాకూర్ కన్నా ముందు ఈ ఫీట్ సాధించారు.
శార్దూల్ ఠాకూర్ సూపర్ బౌలింగ్తో సౌతాఫ్రికా టీ బ్రేక్ సమయానికి 7 వికెట్లకు 70 ఓవర్లలో 191 పరుగులు చేసింది. క్రీజులో మార్కో జాన్సెన్(2), కేశవ్ మహరాజ్(11 బ్యాటింగ్) ఉండగా.. సౌతాఫ్రికా 11 పరుగుల వెనుకంజలో ఉంది. శార్దూల్కు తోడు షమీ రెండు వికెట్లు తీశాడు. తొలి రోజు ఆటలో ఎయిడెన్ మార్క్రమ్ను ఔట్ చేసిన షమీ.. రెండో రోజు రబడా(0)ను పెవిలియన్ చేర్చాడు. ఇంకో సెషన్ ఆట మిగిలుండగా.. సౌతాఫ్రికాకు లీడ్ దక్కకుండా ఆలౌట్ చేస్తే మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించవచ్చు.
ఇక భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఇన్నింగ్స్ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు.