చెన్నై సూపర్ కింగ్స్ ఇన్స్టా లైవ్..
అయితే తాజాగా ఈ థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్పై వాట్సన్ స్పందించాడు. నాటి ఫైనల్ మ్యాచ్లో తనకు గాయమైందన్న విషయం గ్రహించలేకపోయానని తెలిపాడు. మ్యాచ్ చివర్లో రనౌట్ తప్పించుకునేందుకు వేసిన డైవ్తో రక్తం వచ్చిందనుకున్నానని, కానీ అంతకన్నా ముందే గాయపడ్డానని, రక్తంతో నా ప్యాంట్ తడిసిందన్న విషయాన్ని గుర్తించలేకపోయానన్నాడు. మ్యాచ్ తెల్లారి తన సతీమణి ఈ విషయం తెలియజేసిందని చెప్పుకొచ్చాడు.
ఇక కరోనా కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ నిర్వహణపై సందేహం నెలకొన్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లందరితో ఇన్స్టాగ్రాంలో ఓ లైవ్ సెషన్ను నిర్వహించింది. ఈ లైవ్చిట్ చాట్లో పాల్గొన్న వాట్సన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రక్తంతో ప్యాంట్ తడిసినా గుర్తించలేకపోయా..
‘ఎప్పుడు గాయమైందోననే విషయంపై నాకు అవగాహన లేదు. చివర్లో గెలుపు ముంగిట రనౌటై క్రీజును వీడేదాకా మోకాలి నుంచి రక్తం కారుతుందన్న విషయాన్ని గ్రహించలేకపోయా. అది కూడా నడుస్తు మైదానం వీడుతున్నప్పుడు ప్యాడ్స్పై ఉన్న రక్తాన్ని చూసి గాయమైందన్న విషయాన్ని గుర్తించా. చివర్లో రనౌట్ తప్పించుకోవడానికి వేసిన డైవ్తో ఈ గాయమైందనుకున్నా.
కానీ మరుసటి రోజు నా భార్య అంతకన్నాముందే గాయమైందని, ప్యాంట్పై రక్తం కనిపించిందని చెప్పింది. తొలి ఓవర్లలోనే రనౌట్ తప్పించుకోవడానికి డైవ్ వేసినప్పుడే మోకాలి నుంచి రక్తం కారిందని తెలిపింది. కానీ నిజంగా అప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు. ఆ చిన్న గాయం నన్ను ఆపలేకపోయింది. నేను అంతకుముందే ఎన్నో విభిన్నమైన పరిస్థితుల్లో ఆడాను. కాబట్టి చెన్నైకి అత్యంత ముఖ్యమైన ఆ సమయంలో గాయం నన్ను ఆపలేకపోయింది. ఇక చెన్నై జట్టులో చేరినప్పటి నుంచి నాకు లభిస్తున్న మద్దతు, ప్రేమ అత్యద్భుతం'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు.
ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది.. వయసు మీదపడినట్లు అనిపించ లేదు: రైనా
కెప్టెన్ అంటే ధోనీ..
చెన్నైకి ఆడుతున్నప్పుడు వరుసగా పది మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేయకపోయినా తుది జట్టులో స్థానం ఉంటుంది. అదే మరో ఫ్రాంచైజీ అయితే మనపని అయిపోయినట్లే. రిజర్వ్ బెంచ్కు పరిమితం కావలసిందే. ఆటగాళ్లకు బ్రేక్ సమయంలో డ్రింక్స్ అందించుకుంటూ ఉండాలి. కానీ చెన్నై జట్టు అలా కాదు. అందుకు ముఖ్యంగా కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్లకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
‘సీజన్ మొత్తంలో నేను బాగానే బ్యాటింగ్ చేశా. కానీ మంచి స్కోర్లు మాత్రం చేయలేకపోయా.. నన్ను బెంచ్కే పరిమితం చేస్తారనుకున్నా.. కానీ వాళ్లు అలా చేయలేదు. అయితే ఫైనల్ మ్యాచ్లో వారి నమ్మకాన్ని నేను నిలబెట్టగలిగాను. నేను కచ్చితంగా చెప్పగలను నిజమైన నాయకత్వం అంటే ధోనీదే'అని వాట్సన్ తెలిపాడు.
ఫైనలంటేనే వాట్సన్..
ఇక 2018 సీజన్తో చెన్నై తరఫున బరిలోకి దిగుతున్న వాట్సన్.. ఆ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 150 స్ట్రైక్రేట్తో 555 పరుగులు చేశాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో అద్భుత సెంచరీతో చెన్నైని చాంపియన్గా నిలిపాడు. ఇక గత సీజన్లో లీగ్ దశలో మాములుగానే ఆడిన వాట్సన్.. ముంబైతో జరిగిన ఫైనల్లో మాత్రం అద్భుతంగా పోరాడాడు. 59 బంతుల్లో 89 పరుగులతో జట్టును మరోసారి గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ ఆఖర్లో అనూహ్యంగా రనౌటై క్రీజును వీడటంతో ధోనీ సేన ఒక్క పరుగుతో టైటిల్ను చేజార్చుకుంది.