సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొడుకు జాసన్తో కలిసి బైక్ రైడ్కు వెళ్లగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. బైక్ను అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. తొలుత ఎటువంటి గాయం కాలేదని భావించిన వార్న్ ఆసుపత్రికి వెళ్లలేదు. కానీ, సోమవారం ఉదయం నిద్రలేచే సమయానికి గాయం తీవ్రమై భరించలేని నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. 'నాకు గాయమైంది. నొప్పి తీవ్రంగా ఉంది.
నేను అదుపు తప్పి బైక్పై నుంచి కిందపడిపోయాను. ఆ సమయంలోనేనే కాస్త భయపడ్డాను. స్పల్ప గాయాలతో బయటపడ్డాను. అప్పుడు నేను బాగానే ఉన్నానని అనుకున్నాను. కానీ మరుసటి రోజుకి గాయం తీవ్రమైంది. దీంతో పూర్తిగా నడవలేకపోయాను. తర్వాత ఆసుపత్రికి వెళ్లగా నా కాలికి గాయమైందని వైద్యులు తెలిపారు. యాషెస్ సిరీస్లో భాగంగా గబ్బాలో జరిగే తొలి టెస్ట్కు నేను అందుబాటులో ఉంటాను" అని వార్న్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు.
డిసెంబర్ 8 నుంచి బ్రెస్బెన్లో మొదలయ్యే యాషెస్ సిరీస్లో వార్న్ కామెంటరీ చెప్పాల్సి ఉంది. అప్పటికల్లా కోలుకోవచ్చని భావిస్తున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా వేల్స్ క్రికెట్ బోర్డులు యాషెస్ నిర్వహణపై ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. 'మేము ఇప్పుడే ఆస్ట్రేలియాతో చర్చలు మొదులుపెట్టాం. సరిహద్దు మూసివేత నిర్ణయాలు ఉండవచ్చు. మా కుటుంబాలు ప్రయాణించేందుకు మాత్రం అనుమతించవచ్చు. ఈ నిర్ణయాలు మా పై ప్రభావం చూపవని భావిస్తున్నాం. కానీ మొత్తం జాతీయ, స్థానిక ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది'అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ యాష్లీ గెలిస్ పేర్కొన్నారు.