
హైదరాబాద్: సొంతగడ్డపై గురువారం ముంబై ఇండియన్స్తో ఆఖరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లో సన్రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో కూడా సన్రైజర్స్ విజయం సాధించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
ముంబై ఇండియన్స్తో మ్యాచ్ అనంతరం తిరిగి హోటల్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. ఆటగాళ్ల కోసం ప్రత్యేక కేక్ను హోటల్ సిబ్బంది తయారు చేసి ఉంచారు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న రషీద్ ఖాన్ కేక్ కట్ చేశాడు. అనంతరం జట్టులోని మిగతా ఆటగాళ్లు రషీద్ ఖాన్ ముఖానికి కేక్ పూశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. కాగా, గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. హైదరాబాద్ బ్యాటింగ్లో శిఖర్ ధావన్(45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, దీపక్ హుడా(32 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
హైదరాబాద్ ఓపెనర్లు శిఖర్ ధావన్, వృద్ధిమాన సాహాలు ఆరంభించారు. వీరిద్దరి జోడి తొలి వికెట్కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించిన తర్వాత సాహా(22) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్(6) పెవిలియన్కు చేరాడు. అదే సమయంలో దూకుడుగా ఆడుతోన్న శిఖర్ ధావన్ కూడా పెవిలియన్ చేరాడు.
దీంతో హైదరాబాద్ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత మనీష్ పాండే(11), షకిబుల్ హసన్(12)లు ఔటయ్యారు. ఈ క్రమంలో దీపక్ హుడా, యూసఫ్ పఠాన్లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ సమయంలో పఠాన్(14) పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఆ తర్వాతి బంతికే రషీద్ ఖాన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. 19 ఓవర్లో సిద్ధార్ధ్ కౌల్, సందీప్ శర్మలు సైతం పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 137 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.

ఈ సమయంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్ను బెన్ కటింగ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని దీపక్ హుడా తొలి బంతిని సిక్స్ కొట్టగా, రెండో బంతి వైడ్ అయ్యింది. ఆ తర్వాత రెండో బంతికి పరుగు రాకపోగా, మూడో బంతికి పరుగు వచ్చింది. నాలుగో బంతిని స్టాన్లేక్ సింగిల్ తీసి హుడాకు స్టైకింగ్ ఇచ్చాడు.
ఇక ఐదో బంతికి మరో సింగిల్ రాగా, చివరి బంతిని స్టాన్ లేక్ ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో మార్కండే నాలుగు వికెట్లు తీయగా, రెహమాన్ మూడు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు శుక్రవారం కోల్కతా బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సన్రైజర్స్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈడెన్గార్డెన్స్ వేదికగా శనివారం కోల్కతా నైట్రైడర్స్ను సన్రైజర్స్ తలపడనుంది. ఈ సీజన్లో మూడో విజయం సాధించాలని సన్ రైజర్స్ ఊవిళ్లూరుతోంది.