హైదరాబాద్: అంతర్జాతీయ టీ20ల్లో యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ను కాదని రవీంద్ర జడేజాను ఎంపికచేయడం బాలేదని టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. సునీల్ జోషీ ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీ సోమవారం వర్చువల్గా సమావేశమై.. ఈ సిరీస్ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది.
అయితే ఈ ఎంపికపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను ఈ టూర్ మొత్తానికి తప్పించడాన్ని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని 'టీ20లకు రవీంద్ర జడేజా పనికిరాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ తీసుకోవాల్సింది. మీరేమంటారు?'అని మంజ్రేకర్ను ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. దీనికి మంజ్రేకర్ సదరు అభిమాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపాడు. జడేజాకు బదులు, అక్షర్ పటేల్ను తీసుకోవాల్సిందని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరూ జడేజానే సరైనవాడంటే మరికొందరూ అక్షర్కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
completely agree. https://t.co/osH78wATdm
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 27, 2020
గతేడాది ప్రపంచకప్ సందర్భంగా రవీంద్ర జడేజాను 'బిట్స్ అండ్ పీసెస్' ఆటగాడిగా అభివర్ణించి తీవ్ర విమర్శలు పాలైన మంజ్రేకర్.. ఆ తర్వాత 'వాయిస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పిలిచే హర్షా భోగ్లేను కూడా కించపరిచేలా మాట్లాడాడు. భోగ్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ, లిస్ట్ ఎ మ్యాచ్లు కానీ ఆడలేదని విమర్శించాడు. అప్పట్లో జడేజా కూడా మంజ్రేకర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నీ నోటి విరేచనాలను ఆపు'అని బదులిచ్చాడు. దాంతో వారి మధ్య మాటల యుద్దం నడిచింది.
ఈ వివాదస్పద వ్యవహారశైలితోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కామెంటేటర్గా సంజయ్ మంజ్రేకర్పై వేటు వేసింది. ఐపీఎల్ 2020 సీజన్ కామెంటేటర్ లిస్ట్ నుంచి అతన్నితప్పించింది. ఈ విషయంలో క్షమాపణలు కోరుతూ మంజ్రేకర్ బీసీసీఐకి అనేక మెయిల్స్, లేఖలు రాసినా భారత క్రికెట్ బోర్డు కరుణించలేదు.