న్యూఢిల్లీ: తమ టెస్టు జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పని చేయాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇచ్చిన బంపరాఫర్ను టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తిరస్కరించాడు. ముందే కుదుర్చుకున్న ప్రొఫెషనల్ ఒప్పందాలతో పాటు వ్యక్తిగత పనుల వల్ల కన్సల్టెంట్గా ఉండలేనన్నాడు.
ఇప్పటికే కామెంటేటర్గా వ్యవహరిస్తున్నానని, భవిష్యత్తులో బంగ్లా క్రికెట్ బోర్డుతో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.
12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్ 2014 నుంచి 2019 వరకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా ఐదేళ్ల పాటు సేవలందించాడు. టీమిండియా బ్యాట్స్మెన్ లోపాలను సరిదిద్ది వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే వరల్డ్కప్ అనంతరం తన పదవికాలం ముగియడంతో విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో తమ టెస్టు జట్టును పటిష్టపర్చేందుకు బంగ్లాదేశ్ బంగర్ సేవలను కోరింది.
ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్నాడు. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్ బ్యాటింగ్ సలహాదారుడి కోసం బీసీబీ అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్ను సంప్రదించింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్గా కొనసాగుతాడని కూడా బీసీబీ స్పష్టం చేసింది.