ఐపీఎల్కు సిద్ధం
వచ్చే ఏడాది ఐపీఎల్తో పాటు ప్రపంచకప్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీశాంత్.. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్కు తాను సిద్ధంగా ఉన్నట్లు తాజాగా తెలిపాడు. క్రిక్ ట్రాకర్ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడిన శ్రీశాంత్.. ఐపీఎల్లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్ అని శ్రీశాంత్ తెలిపాడు. గతంలో సచిన్ టెండూల్కర్తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ నుంచి తనకు ఎంతగానో సహకారం లభించిన కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.
ముంబైకే నా తొలి ప్రాధాన్యత
'ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడేందుకే నా తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో పాటు, ఎంఎస్ ధోనీ సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కూడా ఆడాలనుకుంటున్నా. ఒక వేళ ఆ మూడు జట్లు కాకపోతే ఏ జట్టు తీసుకున్నా ఆడతా. క్రికెట్ అభిమానిగా ముంబై ఇండియన్స్ అంటే ఇష్టం. సచిన్ పాజీని కలిసే అవకాశం ఉంటుంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అవకాశం వస్తే ముంబైకు ఆడటానికి సిద్ధంగా ఉన్నా' అని శ్రీశాంత్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఐపీఎల్ 2021 ఆక్షన్ కోసం తన పేరును నమోదుచేసుకుంటానన్నాడు.
భారత్ తరఫున 169 వికెట్లు
'ఇది నాకు రెండో జన్మ. ఆ రోజు మ్యాచ్ పార్టీ ముగిసిన తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసారు. ఆపై టెర్రరిస్ట్ వార్డులో ఉంచారు. నన్ను బక్రాను చేస్తున్నట్లు భావించాను. దాదాపు 12 రోజుల పాటు రోజుకి 16-17 గంటలు నరకం అనుభవించాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ, ఇల్లు గురించే ఎక్కువగా ఆలోచించేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య నన్ను చూడడానికి వచ్చాడు. అందరూ బాగున్నారు అని అన్నయ్య చెప్పక నా మనసు కొంత కుదుటపడింది. క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ఇక్కడ ఓ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నా. నేను జైలుకి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ నా ఫొటోలు తీయలేదు. దాంతో నా పిల్లలు వాటిని చూసే బాధపడతారనే బెంగ లేదు' అని కేరళ స్పీడ్స్టర్ చెప్పాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లాడి.. మొత్తం 169 వికెట్లు పడగొట్టాడు.
సెప్టెంబరుతో శిక్షా కాలం పూర్తి:
2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది.
హే హార్దిక్.. నువ్ పుష్ అప్స్ మాత్రమే చేశావ్.. నేను క్లాప్స్ కూడా జత చేస్తున్నా: కోహ్లీ