RR vs PBKS: సంజూ శాంసన్ సెంచరీ పోరాటం వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ.!

ముంబై: వారెవ్వా వాటే మ్యాచ్..! వాంఖడే మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. బ్యాట్స్మెన్ పరుగుల పండుగ చేసుకున్నారు.దాంతో అభిమానులకు అసలు సిసలు ఐపీఎల్ మజా చూశారు. అయితే ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు పంజాబ్ కింగ్స్ 4 పరుగులతో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఐపీఎల్ రణరంగంలో ఆఖరి బంతికి అదిరే విజయాన్నందుకున్న పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ను గ్రాండ్గా ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) సెంచరీతో ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక గత సీజన్ రాహుల్ తెవాటియా లాగేసుకున్న విజయానికి పంజాబ్ ఈ సీజన్లో ప్రతీకారం తీర్చుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40)రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ మోరిస్కు రెండు, రియాన్ పరాగ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులకే పరిమితమైంది. సంజూ శాంసన్కు అండగా మరే బ్యాట్స్మెన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. బట్లర్, పరాగ్, దూబే రాణించినా అది సరిపోలేదు.

ఆదిలోనే షాక్..
అంతకుముందు 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే బెన్ స్టోక్స్(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ఫోర్తో ఖాతా తెరవగా.. మరో ఓపెనర్ మనన్ ఓహ్రా సిక్స్తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో మనన్ వోహ్రా(12) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, శాంసన్ ధాటిగా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 59 రన్స్ చేసింది.

చెలరేగిన శాంసన్..
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జై రిచర్డ్సన్ విడదీసాడు. బట్లర్(25) క్లీన్ బౌల్డ్ చేసి 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత శివమ్ దూబే రాగా.. శాంసన్ తనదైన మార్క్ షాట్స్తో చెలరేగాడు. అయితే అతను ఇచ్చిన పలు క్యాచ్లను పంజాబ్ బౌలర్లు నేలపాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. 53 పరుగులు జోడించిన తర్వాత అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో దూబే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ వచ్చిన రావడంతో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

శాంసన్ సెంచరీ..
మరోవైపు శాంసన్ కూడా చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే దాటిగా ఆడుతున్న రియాన్ పరాగ్(11 బంతుల్లో 25)ను షమీ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జై రిచర్డ్ సన్ వేసిన 18 ఓవర్లో 4, 6, 4 బాదిన సంజూ శాంసన్ 53 బంతుల్లో సెంచరీ పూర్త చేసుకున్నాడు. అయితే మెరిడిత్ వేసిన మరుసటి ఓవర్లో రాహుల్ తెవాటియా ఔటవ్వగా.. క్రిస్ మోరిస్తో శాంసన్ పోరాడాడు. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 13 రన్స్ అవసరం కాగా.. శాంసన్ ఓ సిక్స్ మాత్రం కొట్టడంతో పంజాబ్ విజయం లాంచనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications