న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో దారుణ వైఫల్యం నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు ప్రక్షాళణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విండీస్ బోర్డు.. వైట్ బాల్ టీమ్ను సరిదిద్దే పనిని అప్పజెప్పింది. ఇక ప్రపంచకప్ వైఫల్యానికి గల కారణాలను తెలుసుకున్న లారా సారథ్యంలోని కమిటీ.. జట్టులో మార్పులు మొదలుపెట్టింది. ముందుగా వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్పై వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతన్ని తప్పించి రోవ్మన్ పొవెల్కు జట్టు పగ్గాలందించేందుకు సిద్దమైంది. అయితే ఈ నిర్ణయంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా వెస్టిండీస్ క్రికెట్ టీమ్ టీ20 ప్రపంచకప్ 2022 క్వాలిఫయర్స్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. పసికూన ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై సూపర్-12కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది. క్వాలిఫయర్స్లో మొత్తం మూడు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో( జింబాబ్వేపై ) గెలిచింది.
ఇక బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అప్పుడు కెప్టెన్ నికోలస్ పూరన్ వివరణ ఇచ్చాడు. పేలవ ఆట తీరుతో అందర్నీ బాధపెట్టామని క్షమాపణలు కోరాడు. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షిమ్రాన్ హెట్మైర్ వంటి ఆటగాళ్లంతా జట్టుకు దూరంగా ఉండటంతోనే వెస్టిండీస్కు ఈ గతి పట్టింది. బోర్డుతో ఉన్న సమస్యలతో ఈ ఆటగాళ్లు జట్టుకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచకప్ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్లోనే ఆడుతున్నారు. నాణ్యమైన ఆటగాళ్లంతా జట్టుకు దూరమవ్వడంతో వెస్టిండీస్ పూర్తిగా బలహీనమైంది.
ఇక కెప్టెన్గా బ్యాటర్గా విఫలమైన నికోలస్ పూరన్పై ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ కూడా వేటు వేసింది. గత సీజన్లో రూ. 10 కోట్ల భారీ దరకు తీసుకున్న సన్రైజర్స్ ఈ సారి వేలంలోకి వదిలేసింది. ఇప్పుడు వెస్టిండీస్ కెప్టెన్సీని కూడా పూరన్ కోల్పోయాడు.