క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు:
రాస్ టేలర్ వన్డే ఫార్మాట్లో 231 మ్యాచ్లు ఆడాడు. ఇటీవల భారత్తో ముగిసిన మూడు టీ20ల సిరీస్లో వందో మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ రోజు ప్రారంభమైన తొలి టెస్టు.. టేలర్ కెరీర్లో వందో టెస్టు. దీంతో మూడు ఫార్మాట్లలో వంద మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. వెల్లింగ్టన్లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో టేలర్ తన ఫ్యామిలీతో కలిసి మైదానంలోకి వచ్చాడు.
వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు:
రాస్ టేలర్ కివీస్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా కూడా కొనసాగుతున్నాడు. వన్డేల్లో 7,174 పరుగులు చేసిన టేలర్.. టెస్టుల్లో 8,570 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలమ్, ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పొట్టి క్రికెట్లో టేలర్ కన్నా ఎక్కువ పరుగులు చేశారు. భవిష్యత్లో పొట్టి క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా ఉన్నందున మెక్కలమ్ రికార్డు బద్దలు కానుంది.
100 టెస్టులు, 231 వన్డేలు, 100 టీ20లు:
2006లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల రాస్ టేలర్.. ఇప్పటివరకు 100 టెస్టులు, 231 వన్డేలు, 100 టీ20 మ్యాచ్లు ఆడాడు. కివీస్ తరఫున 40 సెంచరీలతో ఆ జట్టు తరపున అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కూడా ఘనత వహించాడు. ఇటీవలే 2023 వన్డే ప్రపంచకప్ వరకు తాను ఆడతానని టేలర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ మాదిరిగా 40 ఏళ్ల వరకు ఆడాలనుందని కూడా చెప్పాడు.
చెలరేగిన జెమీసన్:
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కి వరుణుడు అడ్డుపడ్డాడు. టీ బ్రేక్ తర్వాత వర్షం కురుస్తుండడంతో మ్యాచ్కి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భారత్ ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. క్రీజులో రిషబ్ పంత్ (10 నాటౌట్), అజింక్య రహానే ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. ఓవర్కాస్ట్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ బౌలర్లు చెలరేగారు. పృథ్వీ షా (16), చటేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), హనుమ విహారి (7) వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (34) కాస్త ఫర్వాలేదనిపించాడు. అరంగేట్ర బౌలర్ కైలీ జెమీసన్కు మూడు వికెట్లు దక్కాయి.