|
జంతువులపై ప్రేమను చూపండి..
ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘కేరళలో జరిగిన విషయం తెలిసి ఆందోళన చెందా. జంతువులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలి'అని కోహ్లీ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. దానికి ఏనుగు కడుపులో బిడ్డతో ఉన్న బొమ్మను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఓ ఎనుగు పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడానికి వారికి మనసెలా వచ్చిందని, వారిని కఠినంగా శిక్షించాలని హర్భజన్ సింగ్ డిమాండ్ చేశాడు.
|
గుండె పగిలింది..
ఇక ఏనుగు మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ‘ మనం క్రూరులమా.. ఇప్పటికీ ఏమీ నేర్చుకోలేకపోతున్నామా? కేరళలో ఏనుగు మరణించిన తీరు వినగానే నా గుండె పగిలినట్టైంది. ఏ జంతువు పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించకూడదు.' అని హిట్మ్యాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
|
మరో సిగ్గుమాలిన చర్య
ఇక దుర్మార్గులైన మనుషుల చేసిన మరో సిగ్గుమాలిన చర్య అని సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా మండిపడ్డాడు. ‘‘దుర్మార్గులైన మనుషులు చేసిన మరో సిగ్గుమాలిన చర్య. జంతువుల పట్ల ప్రేమగా ఉంటే మానవులకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ ఏనుగుకు పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్ను పెట్టిన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి'' అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛైత్రి సైతం ఏనుగు మరణానికి సంతాపం తెలుపుతూ.. పైనాపిల్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేలుడు పదార్థలతో నిండిన పైనాపిల్ ఇచ్చి..
కేరళలోని మలప్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని కొందరు పేలుడు పదార్థాలతో నిండిన పైనాపిల్ ఇచ్చారు. దాంతో.. ఆకలితో ఉన్న ఆ ఏనుగు వెంటనే దాన్ని నోట్లో పెట్టుకోగా అది పేలింది. పైనాపిల్ పేలుడుతో తీవ్రంగా గాయపడిన ఏనుగు నోటి నుంచి రక్తం కారగా.. ఈగలు వాలుతూ ఆ బాధని మరింత పెంచాయి. దాంతో.. ఉపశమనం కోసం ఆ ఏనుగు వెల్లియార్ నదిలోకి వెళ్లి నిల్చొంది. రోజుల తరబడి నదిలోనే ఏనుగు ఉండటంతో స్థానికులు వెటర్నరీ డాక్టర్కి సమాచారం అందించారు. దాంతో స్థానిక అటవీ శాఖ అధికారుల సాయం తీసుకున్న ఆ డాక్టర్.. ఆ ఏనుగుని నది నుంచి వెలుపలికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ.. అప్పటికే రోజుల తరబడి ఆహారం లేక బలహీనపడిన ఏనుగు.. నదిలోనే తనువు చాలించింది. దాంతో.. మృతదేహాన్ని వెలుపలికి తీసుకొచ్చి పరిశీలించిన డాక్టర్.. ఆ ఏనుగు కడుపులో ఓ బిడ్డ ఉందని.. అది కూడా చనిపోయిందని వెల్లడించాడు. ఈ ఘటన అందర్నీ కలచివేసింది.
ఉద్దేశ పూర్వకంగానే తినిపించారా?
అయితే ఎనుగుకు ఉద్దేశపూర్వకంగానే పటాసులతో కూడిన పైనాపిల్ తినిపించారా? వైరల్ న్యూస్ వ్యాప్తిలో ఎంత వరకు నిజం ఉంది? అనే విషయంపై స్పష్టత లేదు. అక్కడి అటవీ అధికారులు మాత్రం ఘటన జరిగిన సైలెంట్ వ్యాలీ అడవి శివారులో పంటలున్నాయని, వాటిని రక్షించుకోవడానికి రైతులు వల లేదా, తీవ్రమైన పద్దతిలో ఇలాంటి పండ్లను ఉంచుతారంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు పైనాపిల్ను ఉంచారేమో అని, ఆకలితో ఉన్న ఆ ఏనుగు పైనాపిల్ను తిని గాయపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏనుగుకు ఉద్దేశ పూర్వకంగానే మనుషులు ఈ పండును పెట్టారని మాత్రం వారు వెల్లడించలేదు. మరో వైపు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.