|
గట్టిగా అప్పీల్ చేసినా:
ఈ మ్యాచులో ఓ ఔట్ విషయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎంత మొత్తుకున్నా.. టీమిండియా క్రికెటర్లు దాన్ని పట్టించుకోలేదు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా పేసర్ నటరాజన్ వేసిన 84 ఓవర్ మూడో బంతిని లెంగ్త్ బాల్ వేశాడు. ఆ బంతిని ఆడదామని భావించిన కెప్టెన్ టిమ్ పైన్.. చివరి నిమిషంలో విడిచిపెట్టాడు. అవుట్ సైడ్ స్వింగ్ అవుతూ వెళ్లిన బంతి.. పంత్ చేతుల్లో పడింది. అది బ్యాట్స్మన్ పైన్ బ్యాట్కు తగిలినట్లు భావించిన పంత్.. గట్టిగా అప్పీల్ చేశాడు. దానికి అంపైర్ సహా టీమిండియా క్రికెటర్లూ ఎవరూ స్పందించలేదు.
నవ్వుకున్న రోహిత్, పుజారా:
డీఆర్ఎస్ కోరదామని కెప్టెన్ అజింక్య రహానేను కోరినా.. రిషభ్ పంత్ వైపు చూస్తూ నవ్వి వదిలేశాడు. ఇక స్లిప్ల్లో ఫీల్డింగ్ చేస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చటేశ్వర్ పుజారాలు కూడా నవ్వి ఊరుకున్నారు. దీనికి పంత్ చాలా నిరాశ చెందాడు. తాను ఔట్ అని మొత్తుకున్నా.. సహచర క్రికెటర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పంత్ అసంతృప్తికి లోనయ్యాడు. బంతిని నేలకేసి కొట్టబోయి.. గిల్కు అందించి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. 'పంత్ ఎవరిని నమ్మించలేకపోయాడు' అని ఐసీసీ కాప్షన్ పెట్టింది. 'అయ్యో పాపం పంత్' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అందుకేనా పట్టించుకోలేదు:
ప్రత్యర్థి ఆటగాళ్ల ఔట్ విషయంలో మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ చెబితే.. అది దాదాపు కచ్చితంగా ఉండేది. డీఆర్ఎస్ విషయంలో కానీ, స్టంపింగ్లో కానీ క్యాచ్ ఔట్ విషయంలో కానీ మహీది ప్రత్యేక శైలి. ధోనీ అప్పీల్ చేస్తే.. ఓసారి ఎంపైర్ కూడా ఔట్ ఇచ్చాడు. ఇక మహీ వారసుడిగా వచ్చిన యువ క్రికెటర్ రిషభ్ పంత్ మాత్రం కచ్చితత్వంలో విఫలమవుతున్నాడు. చాలాసార్లు అతడు ఇచ్చిన సలహాలు విఫలమయ్యాయి. అందుకే నాలుగో టెస్టులో ఆ ఔట్ విషయంలో పంత్ ఎంత మొత్తుకున్నా.. భారత క్రికెటర్లు దాన్ని పట్టించుకోలేదు. అయితే అది ఔటా? కాదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.
మూల్యం చెల్లించుకున్న టీమిండియా:
ఇక 37 పరుగుల వద్ద దొరికిన లైఫ్ను లబుషేన్ సద్వినియోగం చేసుకుని సెంచరీ చేశాడు. సైనీ వేసిన 36 ఓవర్ ఐదో బంతికి గల్లీలోకి స్టైయిట్ ఫార్వర్డ్ క్యాచ్ ఇచ్చాడు లబూషేన్. దాన్ని అజింక్య రహానే జారవిడిచాడు. పట్టాల్సిన క్యాచ్ను వదిలేయడంతో రహానే నిరాశ చెందాడు. స్మిత్ ఔటైన తర్వాత ఓవర్లో లబూషేన్ క్యాచ్ ఇచ్చినా.. అది నేలపాలైంది. ఆ తర్వాత లబూషేన్ ఇచ్చిన మరొక క్యాచ్ ఫస్ట్ స్టిప్లో పుజారా ముందు పడిపోవడంతో మరోసారి బ్రతికిపోయాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీని సెంచరీగా మలచుకున్నాడు. శతకంతో ఆసీస్ తేరుకోగా.. టీమిండియా మూల్యం చెల్లించుకుంది.