
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ చిక్కుల్లో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో లాహోర్లోని అదనపు సెషన్స్ కోర్టు బాబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతేడాది చివరలో ఆజమ్పై లాహోర్కు చెందిన హమీజా ముక్తర్ అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా బాబర్ లైంగికంగా వాడుకుంటున్నాడని, గర్భవతిని కూడా చేశాడని ఆమె పేర్కొన్నారు. బాబర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను డబ్బు సాయం చేశానని కూడా చెప్పుకొచ్చారు.
బాబర్ ఆజమ్ తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేశాడని హమీజా ముక్తర్ చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకున్నాడని, ఆ తర్వాత తనను వదిలించుకోవాలని చూశాడని, ఓ సారి తనకు బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హమీజా తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన వైద్య పత్రాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ బాబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా నసీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను ఆదేశించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు తీవ్రంగా, కలవరపరిచే విధంగా ఉన్నాయన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గతంలో హమీజా ఆరోపించారు. దాంతో మరో అదనపు సెషన్స్ జడ్జి అబిద్ రాజా బాబర్, అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. నసీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, వివాహ పునః భరోసాపై ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బాబర్ తనను బలవంతం చేశాడని హమీజా తెలిపారు.
బాబర్ ఆజమ్పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ హమీజా ముక్తర్ డిమాండ్ ఇదివరకే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. బాబర్ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. బొటనవేలు గాయం కారణంగా న్యూజిలాండ్తో మొత్తం సిరీస్ను బాబర్ మిస్ అయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్, టీ20 సిరీస్కు సిద్ధమవుతున్నాడు. ఈ పర్యటనలో పాక్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 26న మొదలై.. ఫిబ్రవరి 14తో ముగుస్తుంది.