హైదరాబాద్: కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సర్దుకుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ జరిగే అవకాశం ఉందని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు.
మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తిగా స్థంభించింది. వైరస్ కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన కొన్ని క్రీడా ఈవెంట్లు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. దీంతో స్టార్ ప్లేయర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్చాట్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో చిట్చాట్ చేశాడు. సరదా ప్రశ్నలతో పాటు అభిమానులకు ఉన్న సందేహాలను అడిగి హిట్మ్యాన్ నుంచి సమాధానాలు రాబట్టాడు.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. 'ఇప్పటికి ఎదురు చూస్తున్నాం. ఏదో దశలో పరిస్థితులు చక్కబడితే జరగవచ్చు'అని రోహిత్ సమాధానమిచ్చాడు.
ఈ సారి మాజట్టులోకి క్రిస్ లిన్, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్ నైల్ వంటి మంచి ఆటగాళ్లను తీసుకున్నాం. స్వింగ్కు అనుకూలించే వాంఖడే పిచ్పై బౌల్ట్ బౌలింగ్ ఎలా చేస్తాడా? అని ఎదురు చూస్తున్నా. బూమ్రా, అతని కాంబినేషన్ జట్టుకు కలిసిరానుంది.'అని తెలిపాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజనన్ బీసీసీఐ ఎప్రిల్ 15 వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం.. మరోవైపు 21 రోజుల లాక్డౌన్తో ఈ క్యాష్ లీగ్ జరగడం కష్టమే అనిపిస్తోంది. దీనికి తోడు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం తానేం చెప్పలేననే మాటలు కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది.