రాణించిన లారా, స్మిత్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ బ్రియాన్ లారా(49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరొక వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు విలియమ్ పెర్కిన్స్(19), నర్సింగ్(9) ఇద్దరూ రనౌటయ్యారు.
అలవోకగా..
అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్) అజేయశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 160 పరుగులు చేసి మరో 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. తరంగాకు తోడుగా తిలకరత్న దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులెమన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ అస్టిన్ ఓ వికెట్ పడగొట్టాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తరంగాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్ శుభారంభం..
వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సచిన్ టెండూల్కర్ (33 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భారత లెజెండ్స్ జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్.. ఆర్ వినయ్కుమార్ (2/25), ప్రజ్ఞాన్ ఓజా (2/12), యువరాజ్ సింగ్ (2/15) ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ నజీముద్దీన్ (40) టాప్ స్కోరర్గా నిలి చాడు. అనంతరం లక్ష్య ఛేదనలో మాజీ ఓపెనర్లు రెచ్చిపోవడంతో భారత్ లెజెండ్స్ జట్టు 61 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.
రెచ్చిపోయిన వీరూ..
చేజింగ్లో సెహ్వాగ్ రెచ్చిపోయాడు.. తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఆపై కూడా బౌండరీల వర్షం కురిపించాడు. జోరు కొనసాగించిన వీరూ.. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతడికి తోడు మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా మెరవడంతో భారత్ 10.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. భారత జట్టుకు సారథ్యం వహించిన సచిన్.. తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. మొత్తానికి ఇద్దరూ కలిసి అభిమానులను ఆకట్టుకున్నారు.