అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్(116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో 174) భారీ శతకంతో చెలరేగాడు. అస్సాం టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్.. జమ్మూ కశ్మీర్తో సోమవారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో ఈ సెంచరీ సాధించాడు. సహచర ఆటగాడు రిషవ్ దాస్(114 నాటౌట్)తో కలిసి మూడో వికెట్కు 273 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ఓడిపోయే మ్యాచ్లో అస్సాం 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభమ్(120), నజీర్(124) సెంచరీలతో చెలరేగగా.. ఫాజిల్ రషీద్ 53 పరుగులతో రాణించారు. అస్సాం బౌలర్లలో చౌదరి, రజ్జకుద్దీన్ రెండేసి వికెట్లు తీయగా.. రియాన్ పరాగ్, స్వరూపమ్, సునీల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అస్సాం 46.1 ఓవర్లలో 3 వికెట్లకు 354 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది.
భారీ లక్ష్యచేధనలో ఆ జట్టు ఓపెనర్లు కృనాల్ సైకియా(23), రాహుల్ హజరికా(8) విఫమైనా.. రిషవ్ దాస్తో కలిసి రియాన్ పరాగ్ చెలరేగాడు. 12 ఫోర్లు, 12 సిక్సర్లతో వీరవిహారం చేయడంతో అస్సాం సునాయస విజయాన్నందుకుంది. ఈ విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్లో రియాన్ పరాగ్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం విశేషం. ఐపీఎల్లో ఇప్పటి వరకు 47 మ్యాచ్లు ఆడిన పరాగ్ 37 ఇన్నింగ్స్ల్లో 522 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్లోనూ 4 వికెట్లు పడగొట్టాడు.