న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చినప్పటి నుంచి కొత్త ఇల్లు కొనమని ఇంట్లోవాళ్లు తొందరపెడుతున్నారని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్పంత్ తెలిపాడు. ఇల్లు కొనుక్కోవడానికి గురుగ్రామ్ బాగుటుంటుందా? లేక మరే ఏదైన ప్రదేశం బాగుంటే చెప్పండని ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ అభిమానులను ట్వీటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
'నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి.. ఇప్పుడైనా కొత్త ఇల్లు తీసుకోమని మా ఇంట్లోవాళ్లు వెంటపడుతున్నారు. అందుకోసం గురుగ్రామ్ బాగుంటుందా? లేదా వేరే ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పండి' అని ట్వీట్ చేశాడు. ఇక పంత్ పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముంబై, నోయిడా, కాన్పూర్, ముజఫర్నగర్ ఇలా అనేక ప్రదేశాలు బాగున్నాయని అభిమానుల కామెంట్ చేస్తున్నారు.
అయితే పంత్ ట్వీట్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్పందించాడు. క్రికెట్ గ్రౌండ్ కొనుక్కుంటే ఎలా ఉంటుందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇటీవల ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో పంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గబ్బా టెస్ట్ల్లో అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ టెస్ట్లో ధనాధన్ బ్యాటింగ్తో ఓటమిని తప్పించాడు.
ఈ సూపర్ పెర్ఫామెన్స్తో పంత్ ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినేషన్లలో ఉన్నాడు. ఆసీస్ పర్యటనలో అతడితో పాటు అద్భుత ప్రదర్శన చేసిన రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, నటరాజన్లు సైతం ఆ అవార్డు రేసులో నిలిచారు. వీళ్లంతా టీమిండియా విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇక రిషభ్ పంత్ ప్రస్తుతం ఇంగ్లండ్తో జరగనున్న నాలుగు టెస్ట్ల సిరీస్ కోసం సమయాత్తం అవుతున్నాడు. చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
How about buying a cricket ground ??
— Irfan Pathan (@IrfanPathan) January 28, 2021