
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను తన సహచర ఆటగాళ్లంతా ముద్దుగా పంటర్ అని పిలిచేవారు. సాధారణంగా జూదం ఆడేవారిని ఈ పేరుతో పిలుస్తారు. అయితే తనకు ఈ పేరు ఎందుకు వచ్చిందో.. ఎవరో పెట్టారో తాజాగా పాంటింగ్ వెల్లడించాడు. ట్విటర్లో అభిమానులతో చిట్చాట్ సందర్భంగా ఓ అభిమాని తొలిసారి మిమ్మల్ని పంటర్ అని ఎవరు పిలిచారని ప్రశ్నించగా.. ఈ పేరు వేనుకున్న రహస్యాన్ని పాంటింగ్ పంచుకున్నాడు.
'1990లో నేను క్రికెట్ అకాడమీలో ఉండేవాడిని. ఆ సమయంలోనాకు నెలకు 40 డాలర్లు ఇచ్చేవారు.ఈ డబ్బు రాగానే నేను వెంటనే కుక్కల రేసు జరిగే ప్రాంతానికి వెళ్లేవాడిని. ఆయా రేసులపై పందెం కాయడం అప్పట్లో నా హాబీగా ఉండేది. దీంతో షేన్ వార్న్ నాకు పంటర్ అనే నిక్నేమ్ పెట్టాడు. క్రమంగా అదే తనకు ముద్దు పేరుగా స్థిరపడిపోయింది.'అని పాంటింగ్ తెలిపాడు.
ఇక పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా 2003,2007 వరల్డ్కప్లు గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. ఆ జట్టు ప్లేయర్ రిషబ్ పంత్లో అపారమైన నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ప్రస్తుత పంత్ పరిస్థితిని ఓ అభిమాని ఈ లెజండరీ దృష్టికి తీసుకెళ్లగా.. టీమిండియా కీపర్ అతనేనని సమాధానమిచ్చాడు. 'అపారమైన నైపుణ్యాలు రిషబ్ పంత్ సొంతం. త్వరలోనే అతను కచ్చితంగా టీమిండియా తుది జట్టులోకి వస్తాడు. ఐపీఎల్ నేపథ్యంలో అతనితో మళ్లీ పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా.' అని పాంటింగ్ తెలిపాడు.
ఇక పాంటింగ్ను ఆల్టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లు ఎవరు? అని మరో నెటిజన్ అడగ్గా.. జాంటీ రోడ్స్, ఏబీ డివిలియర్స్, ఆండ్రూ సైమండ్స్ల పేర్లను పాంటింగ్ సూచించాడు. జాంటీ రోడ్స్, ఏబీ డివిలియర్స్లు దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్లు కాగా... ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయర్. ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం గమనార్హం.