
పెర్త్: ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ మైక్ పట్టాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ శుక్రవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మ్యాచ్ మూడో రోజు అయిన శుక్రవారం లంచ్ సమయంలో చాతిలో నొప్పి రావడంతో పాంటింగ్ ఆసుప్రతిలో చేరాడు. కామెంట్రీ బాక్స్ ఉన్న పళంగా వెళ్లిపోవడంతో అతని అభిమానులు ఆందోళనకు గురయ్యాడు. గుండె పోటు వచ్చిందనే వార్తలు వెలువడటంతో మరింత కంగారు పడ్డారు.
అయితే తాను బాగానే ఉన్నానని, నలతగా అనిపించడంతో ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం హాస్పిటల్కు వెళ్లానని సహచర కామెంటేటర్లకు పాంటింగ్ సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నా పాంటింగ్ ఆసుపత్రిలో ఉండాలని ప్రచారం జరిగింది. దాంతో అతను తన కామెంట్రీ బాధ్యతలు నుంచి తప్పుకుంటాడని అంతా భావించారు. కానీ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రీ మ్యాచ్ షోలో పాంటింగ్ కనబడటంతో అభిమానులు సంతోషానికి గురయ్యారు. ప్రస్తుతం పాంటింగ్ కామెంట్రీ చెబుతున్న ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
1974లో జన్మించిన రిక్కీ పాంటింగ్ భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తరానికి చెందినవాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన సారథిగా పాంటింగ్ గుర్తింపు పొందాడు. 324 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించిన రిక్కీ పాంటింగ్.. 220 మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. అతడి విజయాల శాతం 67.91 కావడం గమనార్హం.
ఆధునిక క్రికెట్లో ఉత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన పాంటింగ్.. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. పాంటింగ్ ఆస్ట్రేలియాకు రెండు వన్డే వరల్డ్ కప్లను అందించాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పాంటింగ్.. ప్రస్తుతం కామెంటేటర్గా, కోచ్గా సేవలు అందిస్తున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.