న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్నకు దూరమైన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి ముందు టీమిండియాకు ఇది ఊహించని షాకే. బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో తెలియక జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇప్పటికైతే అతని స్థానంలో ఎవరిని ఆస్ట్రేలియా తీసుకెళ్లాలనే విషయంలో సెలెక్టర్లు స్పష్టతనివ్వలేదు. అందుకే గురువారం ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టులో బుమ్రా స్థానాన్ని ఖాళీగానే ఉంచారు. ప్రస్తుతానికైతే అతని స్థానాన్ని మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్లలో ఒకరితో భర్తీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుమ్రా గైర్హాజరీపై స్పందించిన రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగాటోర్నీకి బుమ్రా దూరమవడం నిజంగా దురదృష్టమని శాస్త్రి అన్నాడు. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడటం లేదు. ఇలా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడంపై శాస్త్రి మాట్లాడుతూ.. ''ఇది చాలా దురదృష్టకరం. అయితే ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లకు గాయాలు సహజమే. ఇప్పుడు వీళ్లు టోర్నీకి దూరమవడం వల్ల వేరే వాళ్లకు ఇది మంచి అవకాశంగా మారుతుంది. గాయంతో ఏం చెయ్యలేం కదా'' అన్నాడు.
అదే సమయంలో భారత జట్టు చాలా బలంగా ఉందని, టోర్నీలో రాణించే సత్తా ఈ జట్టుకు ఉందని చెప్పాడు. 'భారత జట్టు సెమీఫైనల్స్ చేరుకుంటే చాలు. ఆ తర్వాత ఎవరైనా గెలవచ్చు. టోర్నీలో శుభారంభం దక్కడమే కష్టం. సెమీస్ చేరితే ఏమో.. కప్పు కూడా కొట్టచ్చు. బుమ్రా, జడేజా జట్టులో లేకపోవడం వల్ల కొత్తగా మరో మ్యాచ్ విన్నర్ వెలుగు చూస్తాడేమో?'' అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికైతే బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి షమీ కన్నా మంచి ఆప్షన్ లేదన్నాడు. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవమే షమీకి కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే కరోనా బారిన పడిన షమీ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీసులకు షమీ దూరమయ్యాడు.