బొటనవేలు విరిగింది:
సూపర్ఫామ్లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో అతడికి తొడకండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. శనివారం ఆటలో మిచెల్ స్టార్క్ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి.
మైదానంలోకి రాలేని స్థితిలో జడ్డూ:
సిడ్నీ టెస్టు ఐదవ రోజు ఆటలోని మెదటి సెషన్లో ఆస్ట్రేలియాపై టీమిండియాపై పైచేయి సాధించింది. రిషబ్ పంత్ (97; 118 బంతుల్లో 12x4, 3x6) తృటిలో శతకం కోల్పోగా.. ఛెతేశ్వర్ పుజారా (77; 205 బంతుల్లో 12x4) అర్ధ శతకం బాది ఔట్ అయ్యాడు. భారత్ విజయం సాధించాలంటే.. ఇంకా 132 రన్స్ చేయాలి. విహారి, అశ్విన్ ఆడుతున్నారు. జడ్డూ మైదానంలోకి రాలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆసీస్ ఫేవరేట్గా భావిస్తున్నారు. అయితే భారత జట్టును ఓటమి నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తే.. జడేజా విరిగిన వేలుతోనే బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పెయిన్ కిల్లర్ను తీసుకుని క్రీజులోకి వస్తాడని వెల్లడించాయి.
జట్టును కాపాడాల్సి వస్తే:
'రవీంద్ర జడేజా కోలుకోవడానికి 4-6 వారాల సమయం పడుతుంది. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు కూడా అతడు దూరమవుతున్నాడు. అయితే సిడ్నీ టెస్టులో జట్టును కాపాడాల్సిన పరిస్థితి తలెత్తితే.. జడ్డూ బరిలోకి దిగుతాడు. పెయిన్ కిల్లర్ తీసుకుని క్రీజులోకి వస్తాడు' అని బీసీసీఐ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఆసీస్ జరిగిన తొలి టీ20లో తొడకండరాలు పట్టేసిన జడేజా ఆఖరి వరకు క్రీజులో ఉండి పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
దేశం కోసం స్ఫూర్తిదాయక నిర్ణయం:
తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు 28 పరుగులు చేసిన రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా టూర్ మొత్తం కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందుకే మ్యాచ్ను కాపాడుకోవాల్సి వస్తే కనుక అతడు బ్యాటింగ్ చేస్తాడని ఆ బోర్డు అధికారి స్పష్టం చేశారు. అయితే టెస్టుల్లో ఆసీస్ పేసర్లు బ్యాట్స్మెన్ మీదకు వచ్చేలా బంతుల్ని ఎక్కువగా విసురుతుంటారు. విరిగిన వేలుతో జడేజా ఆ బంతుల్ని ఎదుర్కోవడం అత్యంత ప్రమాదకరమే. దేశం కోసం జడేజా స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నా.. జట్టు యాజమాన్యం దాన్ని అంగీకరిస్తుందో లేదో చూడాలి.
Sydney Test: పుజారా హాఫ్ సెంచరీ.. టెస్టుల్లో అరుదైన మైలురాయి!!