
హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా అన్ని క్రీడా టోర్నీలు రద్దయ్యాయి. దీనికి తోడు ఈ ప్రాణాంతక వైరస్ను నిర్మూలించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, చహల్, పఠాన్, పాండ్యా బ్రదర్స్, శ్రేయస్ అయ్యర్లు కరోనా క్వారంటైన్కు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.
అనుష్కతో కోహ్లీ ఎంజాయ్ చేస్తుండగా.. చహల్ టిక్టాక్లతో బీజీగా ఉన్నాడు. పాండ్యా బ్రదర్స్ ఇంట్లో క్రికెట్ ఆడుతూ.. తమ ప్రియసఖిలతో రోమాన్స్ చేస్తున్నారు. అయ్యర్ తన పెంపుడు శునకంతో ఆడుకుంటున్నాడు. ధావన్, రోహిత్ ఇంట్లో పనులు చేస్తున్నారు. పఠాన్ బ్రదర్స్ సినిమా డైలాగ్స్తో ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
అయితే తాజాగా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా వీరి లిస్ట్లో చేరాడు. ఇంటికే పరిమితమైన ఫిట్నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈ జడ్డూ భాయ్ పేర్కొన్నాడు. 'పరుగెత్తడం నా బలం.. నా శరీరాన్ని రిపేర్ చేయడానికి సరైన సమయం ఇదే'అంటూ ట్రెడ్ మిల్పై రన్నింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు.
అయితే తనకు ఇష్టమైన గుర్రపు స్వారీని మిస్సవుతున్నట్లు తెలిపాడు. గుర్రపు స్వారీ చేయడం తన ఆల్టైమ్ ఫేవరేట్ అంటూ గతంలో గుర్రపు స్వారీ చేసిన వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మైదానంలో కత్తిసాములా బ్యాట్ను తిప్పుతూ సెలెబ్రెట్ చేసుకునే జడేజా గుర్రపు స్వారీ చేస్తుంటే రాజు వస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.