
సిడ్నీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చేతి వెలికి గాయం అయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో ఎడమ చేతి బొటన వేలికి గాయం చేసుకున్న జడేజా.. చివరి టెస్ట్ సహా త్వరలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే తొలి రెండు టెస్ట్లకూ దూరమయ్యాడు. ఇది నిజంగా టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే. అయితే మంగళవారం జడేజా బొటనవేలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఎడమచేతి బొటనవేలికి సర్జరీ అనంతరం చేతికి పట్టితో ఉండగా తీసిన ఫొటోను ట్విటర్లో షేర్ చేసిన జడ్డూ త్వరలో రెట్టించిన బలంతో తిరిగొస్తానని పేర్కొన్నాడు.
మంగళవారం సర్జరీ అనంతరం చేతికి పట్టితో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ... 'కొద్దిరోజులు ఆటకు దూరంగా ఉంటా. చేతివేలి ఈరోజు జరిగిన శస్త్రచికిత్స పూర్తైంది. త్వరలోనే రెట్టించిన బలంతో తిరిగొస్తా' అని ట్వీట్ చేశాడు. జడేజా ట్వీట్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జనవరి 15-19 మధ్య జరగనుంది. మూడు టెస్టులు పూర్తయ్యేసరికి భారత్ 1-1తో సమానంగా నిలిచింది.
సూపర్ఫామ్లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో అతడికి తొడకండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. శనివారం మూడో ఆటలో మిచెల్ స్టార్క్ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
సిడ్నీ టెస్టులో భారత జట్టును ఓటమి నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తే.. రవీంద్ర జడేజా విరిగిన వేలుతోనే బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు సోమవారం తెలిపాయి. పెయిన్ కిల్లర్ను తీసుకుని క్రీజులోకి వస్తాడని వెల్లడించాయి. అయితే రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్; 128 బంతుల్లో 7×4), హనుమ విహారి (23 నాటౌట్; 161 బంతుల్లో 4×4) అద్భుతంగా ఆడి భారత్ను ఓటమి నుంచి బయటపడేశారు. దీంతో జడేజా క్రీజులోకి వచ్చే అవసరం లేకుండా పోయింది.
Thailand Open: ప్చ్.. పీవీ సింధుకు షాక్!! తొలి రౌండ్లోనే ఇంటికి!