బ్యాంకాక్: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 10 నెలల విరామం తర్వాత ఆరంభమైన తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫేవరెట్గా బరిలో దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే సింధు ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధు డెన్మార్క్కు చెందిన మియా బ్లిక్ఫీల్డ్ చేతిలో 21-16, 24-26, 13-21తో ఓటమిపాలైంది.
తొలి గేమ్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు రెండో గేమ్లో ఓటమిపాలైంది. పోటాపోటీగా సాగిన రెండో గేమ్ ఆదిలో సింధుదే ఆధిపత్యం. కానీ మియా బ్లిక్ఫీల్డ్ పుంజుకుని.. మ్యాచ్ను మూడో గేమ్కు తీసుకువచ్చింది. ఆఖరి గేమ్లో జోరును కొనసాగిస్తూ.. బ్లిక్ఫీల్డ్ గేమ్తో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకుంది. 74 నిమిషాల పోరులో బ్లిక్ఫీల్డ్ అద్భుతంగా ఆడింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్కు ముందు మ్యాచ్ ఫిట్నెస్ పరీక్షించుకోవాలని భావించిన సింధుకు నిరాశే ఎదురైంది. గత కొద్దిరోజులుగా సింధు లండన్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.
Highlights | Breathtaking Badminton as 🇮🇳 Pusarla and 🇩🇰 Blichfeldt battle it out 👀 🏸#HSBCbadminton #BWFWorldTour #YonexThailandOpen pic.twitter.com/CqRAarBCBR
— BWF (@bwfmedia) January 12, 2021
పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ కూడా తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. స్థానిక ఆటగాడు వాంగ్చరొయిన్ చేతిలో 16-21, 10-21 తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయించడంతో మ్యాచ్ 40 నిమిషాల్లోపే ముగిసింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-అశ్విన్ పొన్నప్ప విజయాన్ని అందుకున్నారు. 21-11, 27-29, 21-16 తేడాతో ప్రత్యర్థి జోడీని చిత్తుచేశారు.
థాయిలాండ్ ఓపెన్లో ఆడాల్సిన భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ మ్యాచ్లకు దూరమయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో.. సైనా, ప్రణయ్ టోర్నీ నుంచి వైదొలిగారు. కశ్యప్ మాత్రం క్వారంటైన్లో ఉన్నాడు. అతడి రిపోర్ట్ ఇంకా రాలేదు.
నెట్టింట వైరలవుతున్న ఫోటో.. విరుష్క దంపతుల కుమార్తెదేనా!!