
లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021 గెలిచిన అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు అర్ధరాత్రి వరకూ సంబురాలు చేసుకున్నారని, అది చూసి తాను తట్టుకోలేకపోయానని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. కివీస్ ఆటగాళ్ల కేరింతలు యుద్ధ నినాదాల్లా అనిపించాయని వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమి తనకు ఎంతో బాధ కలిగించిందని యాష్ చెప్పాడు. ఫైనల్లో కోహ్లీసేనపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జరిగిన డబ్ల్యూటీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్.. ఫైనల్లో మాత్రం తడబడింది.
తాజాగా రవిచంద్రన్ అశ్విన్ ఓ వీడియోలో మాట్లాడాడుతూ... 'మ్యాచ్ ముగిశాక శీతల పానీయాలు, ట్రోఫీతో కలిసి సంబరాలు చేసుకోవడం న్యూజిలాండ్ జట్టుకు అలవాటు. ఆ దృశ్యం చూడటానికి చాలా కష్టంగా అనిపించింది. కివీస్ ప్లేయర్స్ రాత్రి 12 వరకూ వేడుకలు చేసుకున్నారు. వారు ట్రోఫీ తీసుకొని పిచ్ వద్దకు వచ్చారు. నిజానికి వారి సంబరాలు నాకు యుద్ధ నినాదాల్లా అనిపించాయి. మేము ఆ పని చేయాలేకపోయామే అన్న బాధ నన్ను వెంటటింది. మేం ట్రోఫీ గెలవనందుకు చాలాచాలా నిరాశపడ్డా' అని చెప్పాడు. అయితే చాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా అశ్విన్ నిలవడం అతనికి కాస్త ఊరట కలిగించే అంశం.
ఇటీవలి కాలంలో చాలా రోజుల పాటు బయో బబుల్లో ఉండటం వల్ల తాము అనుభవించిన కష్టాలను కూడా రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు. 'చాలా రోజులుగా బయో బబుల్లో ఉన్నాం. ఇన్నాళ్ల తర్వాత మాకు బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరికింది. నేను ఓ కారు రెంట్కు తీసుకున్నాను. విధులన్నీ తిరుగుతున్నా. చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రేక్ మాకు చాలా ఉపయోగపడనుంది' అని అశ్విన్ చెప్పాడు. ఫైనల్ అనంతరం 20 రోజుల పాటు భారత ఆటగాళ్లకు బీసీసీఐ బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే.
డబ్ల్యూటీసీ టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. యాష్ 14 మ్యాచ్ల్లో 71 వికెట్లు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ ద్వారా ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ను అధిగమించాడు. కమ్మిన్స్ 14 మ్యాచ్ల్లో 70 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లీష్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 17 మ్యాచ్ల్లో 69, కివీస్ బౌలర్ టిమ్ సౌతీ 11 మ్యాచ్ల్లో 56, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయోన్ 14 మ్యాచ్ల్లో 56 వికెట్లు తీసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.