
న్యూఢిల్లీ: తమిళనాడు క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన స్పిన్నర్ ప్రశాంత్ రాజేశ్ గుండెపోటుతో సోమవారం మరణించారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)లో ప్రశాంత్ రాజేశ్ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2018లో ఈ లీగ్లో అరంగేట్రం చేసిన రాజేశ్.. ఎల్వైసీఏ కొవై కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో యార్కర్లతో ఇరగదీస్తున్న టీ నటరాజన్, రాజేశ్ ఒకే జట్టుకు ఆడారు. నటరాజన్ గెలిపించిన థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ మ్యాచ్లో రాజేశ్ మూడు కీలక వికెట్లు తీశాడు.
ఇక రాజేశ్ అకాల మరణం పట్ల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. 35 ఏళ్ల రాజేశ్ తమిళనాడు అండర్-19, రంజీ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక రాజేశ్ మృతి పట్ల తమిళనాడుకే చెందిన భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. టీఎన్పీఎల్లో నీతో గడిపిన క్షణాలు.. మాట్లాడిన మాటలు మరిచిపోలేనన్నాడు. 'రాజేశ్.. ఇక నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. టీన్పీఎల్లో మ్యాచ్లు ముగిసిన అనంతరం నీతో మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. నీ ఆత్మకు చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా'అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఆర్సీబీతో సోమవారం జరిగిన మ్యాచ్లో మన్కడింగ్ స్టంట్తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆర్సీబీ ఓపెనర్ ఆరోన్ ఫించ్కు గట్టి ఝలక్ ఇచ్చాడు.
ఇక రోడ్డు ప్రమాదానికి గురైన అఫ్గానిస్థాన్ యువ ఓపెనర్ నజీమ్ తరకై(29) మంగళవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గత శుక్రవారం నజీబ్ మార్కెట్కు వెళ్లి వస్తుండగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ ప్యాసింజర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాడు. వైద్యుల చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.