న్యూఢిల్లీ: భారత ఆటగాళ్లకు ఫారిన్ లీగ్స్ ఆడాల్సిన అవసరం లేదని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. దేశవాళీ క్రికెట్తో కావాల్సిన నైపుణ్యాలు పెంచుకోవచ్చని అభిప్రాపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత భారత ఆటగాళ్లను విదేశీ లీగ్స్ ఆడేందుకు అనుమతించాలనే అంశం చర్చనీయాంశమైంది. భారత ఆటగాళ్లను ఫారిన్ లీగ్స్లో ఆడనిస్తే అద్భుతంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు.
టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బిగ్బాష్ వంటి లీగ్ల్లో ఆడటం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కలిసొచ్చిందన్నాడు. అయితే, రంజీ సీజన్ జరుగుతున్న సమయంలోనే వీటిని నిర్వహిస్తుండటం వల్ల వీటికి అనుమతిస్తే దేశవాళీ క్రికెట్ నాశనమవుతుందన్నాడు. తాజాగా ఈ అంశంపై మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దేశీయ క్రికెట్ ఉండగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లు ఆడాల్సిన అవసరం లేదన్నాడు.
'ఆటలో నైపుణ్యం సాధించేందుకు, కొత్త అవకాశాలను ఒడిసిపట్టేందుకు దేశీయ క్రికెట్ ఆటగాళ్లకు కావలసినన్ని అవకాశాలను ఇస్తుంది. ఇప్పటికే భారత- ఎ జట్టు పర్యటనలు చేస్తోంది. భవిష్యత్తులో రెండు భారత జట్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు టీమిండియా ఒకచోట ఆడితే ఇంకో జట్టు బయటకు వెళ్లి ఆడుతుంది. దేశీయ క్రికెట్, భారత టీ20 లీగ్, ఇతర పర్యటనల్లోనే వారికి కావలసినంత అనుభవం లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా విదేశీ లీగ్ల్లో ఆడటం వల్ల చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
కోచ్లకు విశ్రాంతి ఇవ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబట్టాడు. ఐపీఎల్ సందర్భంగా దొరికే విశ్రాంతి సరిపోతుందన్నాడు. ''నేను ఈ బ్రేక్స్ను నమ్మను. వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకోను. ఎందుకంటే.. నేనైతే నా టీంను అర్థం చేసుకోవడానికి, ప్లేయర్లను తెలుసుకోవడాని ప్రయత్నిస్తా'' అని స్పష్టం చేశాడు. కోచ్లకు ప్రత్యేకంగా విశ్రాంతి ఎందుకు అవసరమో తనకు తెలియడం లేదన్న రవిశాస్త్రి.. ''ఐపీఎల్ సమయంలో రెండు నెలల పాటు కోచ్లకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ రెస్టే ఎక్కువ అని నా ఫీలింగ్. మిగతా టైంలో కోచ్గా ఎవరున్నా సరే వాళ్లు జట్టుతోనే ఉండాలనేది నా అభిప్రాయం'' అని తేల్చిచెప్పాడు.