న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ మనం చూసిన అన్ని ప్రపంచకప్లకు అమ్మమ్మ వంటిది ఈ కరోనా వైరస్ అని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అలాంటి ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరూ పట్టుదలగా కృషి చేయాలని ఓ వీడియో సందేశాన్ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు స్టే హోమ్, స్టే సేఫ్ అనే క్యాప్షన్ ఇచ్చాడు.
'కరోనా వైరస్పై యుద్ధం ప్రపంచకప్ కోసం పోరాడడం లాంటిదే. ఈ మహమ్మారిపై గెలిచేందుకు సర్వస్వం ధారపోయాల్సిందే. అయితే ఇది మాములు ప్రపంచకప్ వంటిది కాదు. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని ప్రపంచకప్లకు అమ్మమ్మవంటింది. దీని కోసం 11 మంది కాదు.. 130కోట్ల ప్రజలు మైదానంలో ఉన్నారు. యావత్ దేశం పోరాడుతుంది. అయితే ఈ పోరాటంలో గెలవడం అంత సులభం కాదు. కానీ ప్రాథమిక సూత్రాలు పాటిస్తే విజయం మనదే. ప్రపంచకప్ గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని వ్యూహాలు రచిస్తామో.. కరోనాపై విజయం సాధించడానికి అలాంటి ప్రణాళికలే రచించాలి.
వైరస్ చైన్ను తెగగొట్టడమే ప్రధాన లక్ష్యం. ఇక్కడ గెలిస్తే దాదాపు విజయం సాధించినట్టే. ఈ పోరాటంలో వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు, పోలీసుసిబ్బంది, ఇతర అత్యవసర సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని గౌరవించడం మన కనీస బాధ్యత. ప్రధాన నరేంద్ర మోదీ మార్గనిర్దేశకంలో మనల్ని మనదేశాన్ని కాపాడుకుందాం. ఈ ప్రపంచకప్(కరోనాపై)పై గెలిచి తీరుతాం. పదండి మిత్రులారా ఈ పోరాటం కలిసి చేద్దాం. 130 కోట్ల మంది ఒకే తాటిపై, ఒకే మాటపై నిలబడి కరోనా వైరస్ను ఓడిద్దాం. మానవత్వం ప్రదర్శించి ఈ ప్రపంచకప్ విజయాన్నందుకుందా'అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇక ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టిన కరోనా పాజిటివ్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు ఊహించని స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. ఇక దేశావ్యాప్తంగా కరోనాబాధితుల సంఖ్య ఇప్పటి వరకు 11652కు చేరుకోగా.. 393 మంది మరణించారు. 13331 మంది ఈ ప్రాణాంతక వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక తెలంగాణలో బాధితుల సంఖ్య 644కు చేరుకోగా 18 మంది మరణించారు. ఇప్పటి వరకు 110 మంది కోలుకున్నారు. ఇక మంగళవారం ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా 51 కేసులు నమోదవ్వడం కలవరపెట్టే అంశం.