రాయుడిని తీసుకోవాల్సింది..
'అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం వెనుక నా ప్రమేయం ఏమీ లేదు. జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు ధోనీ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ఉండటం అనవసరం అనిపించింది. అంబటి లేదా శ్రేయస్ అయ్యర్ను తీసుకుంటే బాగుండేది. ధోనీ, పంత్, కార్తీక్ను టీమ్లో ఉంచడం వెనుక లాజిక్ ఏంటో నాకిప్పటికీ అర్థం కాలేదు. కానీ సెలెక్టర్ల పనిలో నేను తలదూర్చలేదు. నా అభిప్రాయం అడిగినప్పుడు మాత్రమే నేను డిస్కషన్లో పాల్గొంటా.
కోచ్గా నేనున్నప్పుడు టీమిండియా చాలా అంశాల్లో తొలి స్థానం సాధించింది. కానీ ఐసీసీ ట్రోఫీలు సాధించడంలో మూడు సార్లు ఫెయిల్వడం చాలా బాధపెట్టే అంశం. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఓటమి మరింత బాధ కలిగించింది. ఐదేళ్ల పాటు టెస్టుల్లో నంబర్ వన్గా ఉన్న మా జట్టు ఫైనల్ మ్యాచ్ ఓడటం కరెక్ట్ కాదు'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
రాయుడిని కాదని..
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్కు అవకాశమిచ్చారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయగలడని, రాయుడి కంటే మెరుగైన ఆటగాడని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ఆ వ్యాఖ్యల తర్వాత రాయుడు తీడ్రీ గ్లాస్లో ఆటను చూస్తానని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక రాయుడిని స్టాండ్బై ప్లేయర్గా ఎంపిక చేసినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వలేదు. శిఖర్ ధావన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నా.. రాయుడిని కాదని రిషభ్ పంత్ను తీసుకున్నారు.
దాంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంబటి రాయుడు బీసీసీఐపై కోపంతో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక రాయుడు అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడల్లా ఈ త్రీడీ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
రెండో సారి కోచ్ కాకుండా..
టీమిండియా హెడ్ కోచ్గా తాను రెండో సారి బాధ్యతలు చేపట్టకుండా కొందరు ప్రయత్నించారని కూడా రవిశాస్త్రి తెలిపాడు. తనతో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ను కూడా జట్టు నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించిన నేపథ్యంలో రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధానత్యను సంతరించుకున్నాయి.
టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం హెడ్ కోచ్గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్ పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. ఇక శాస్త్రి స్థానంలో భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్.. ఇప్పటికే స్వదేశంలో టీ20, టెస్టు సిరీస్ల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం అనవసరం అని భావించిన సెలెక్టర్లు వన్డేలకు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్గా నియమించారు.
రోహిత్కు అడ్వైజ్..
టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదని మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన రవిశాస్త్రి అతడికి పలు సూచనలు చేశాడు. 'రోహిత్ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని సమర్థంగా ఉపయోగించుకుంటేనే విజయవంతమైన నాయకుడిగా రాణించగలుగుతాడు' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.