న్యూఢిల్లీ: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. భారత్ పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఈ పరిస్థితి రావడానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు దుమ్మెత్తిపోసారు. బయో బబుల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రవిశాస్త్రి తన 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ బుక్ లాంచింగ్కు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే నాలుగో టెస్ట్ ముందు రవిశాస్త్రి వైరస్ బారిన పడగా.. ఆ తర్వాత అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ పాజిటీవ్గా తేలారు.
ఇక ఐదో టెస్ట్ ముంగిట అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్ కూడా వైరస్ బారిన పడటం.. అతనికి సన్నిహితంగా రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ ఉండటంతో భారత జట్టులో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్పై ప్రభావం చూపిస్తుందని భావించిన బీసీసీఐ.. ఐదో టెస్ట్ను రద్దు చేయించింది. అయితే ఈ బుక్ లాంచింగ్పై కూడా బోర్డు కన్నెర్ర చేసినట్లు.. కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజర్లను వివరణ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మిడ్డే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ముంగిట ఈ విమర్శల విషయాన్ని ప్రస్తావించగా అతను భిన్నంగా స్పందించాడు. యూకే మొత్తం ఆంక్షలు సడలించారని, ఫస్ట్ టెస్ట్ జరిగిన ట్రెంట్ బ్రిడ్జ్ నుంచే వైరస్ రావొచ్చని బదులిచ్చాడు.
'యూకే మొత్తం ఆంక్షలు సడలించారు. ప్రజలంతా స్వేచ్చగా తిరుగుతున్నారు. ఫస్ట్ టెస్ట్ నుంచే ఏదైనా జరగవచ్చు'అని రవిశాస్త్రి తెలిపాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చిందని రవిశాస్త్రి కొనియాడాడు. జట్టులో కరోనా కలకలం రేగినా కోహ్లీసేన అద్భుతంగా రాణించిందన్నాడు. కరోనా విపత్కరపరిస్థితుల్లో కూడా ఆస్ట్రేలియా పర్యటనలో ఆ జట్టును సొంతగడ్డపై ఓడించిందని, ఇంగ్లండ్పై దాదాపు గెలిచినంత పనిచేసిందన్నాడు.