దుబాయ్: యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్లో ప్రతీ మ్యాచ్ తమకు ఫైనల్లాంటిదేనని సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్, అఫ్గానిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ అన్నాడు. కరోనాతో అర్దంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి రీస్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలుకానుంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ సెప్టెంబర్ 22న ఢిల్లీ క్యాపిటల్స్తో సెకండాఫ్ లీగ్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ సెకండాఫ్ లీగ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'సెకండాఫ్ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు కృషి చేస్తాం. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్లో అంచనాల మేరకు రాణించలేకపోయాం. సెకండాఫ్ లీగ్ కోసం మేం మళ్లీ రీ యూనిట్ అయ్యాం. ఈ సీజన్ను మెరుగ్గా ముగించడంపై దృష్టిసారించాం. ప్రతీ మ్యాచ్ను ఫైనల్గా భావించి సాయశక్తులా పోరాడుతాం. గతేడాదిన్నరగా నా బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా. లోయరార్డర్లో 15, 20, 25 రన్స్ చేసినా అది జట్టుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేజింగ్లో లాభం చేకూరుస్తుంది. అయితే దీని కోసం కొత్తగా ఎలాంటి షాట్స్ ప్రాక్టీస్ చేయడం లేదు. కానీ నా శక్తిమేరకు రాణించాలనుకుంటున్నా'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక యూఏఈ పిచ్లపై ఆడిన అనుభవం తమ జట్టు ఆటగాళ్లకు ఉందని, సెకండాఫ్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత్ వేదికగా జరిగిన తొలి దశ లీగ్లో సన్రైజర్స్ ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. సెకండాఫ్లో ఏడు మ్యాచ్లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడుగేసే పరిస్థితి. లేకుంటే మెరుగైన రన్రేట్తో 6 మ్యాచ్లోనైనా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఫస్టాఫ్లో పంజాబ్ కింగ్స్పై గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఓడిన అన్ని మ్యాచ్లు సునాయసంగా గెలిచేవే. కానీ బలహీనమైన మిడిలార్డర్, పేలవ బ్యాటింగ్తో గెలిచే మ్యాచ్లను చేజార్చుకుంది.