
ఇండోర్: రంజీ ట్రోఫీ 2022-23లో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. మధ్యప్రదేశ్తో శుక్రవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 245 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 77 ఓవర్లలో5 వికెట్లకు 245 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశ్ దుబే(58), రజత్ పటీదార్(55) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభామ్ శర్మ(40), సరన్షా జైన్(28 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్, పృథ్వీ రాజ్ రెండేసి వికెట్లు తీయగా.. నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టాడు.
58/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన మధ్య ప్రదేశ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే హిమన్షు మంత్రి(31) ఔటవ్వగా.. శుభమ్ శర్మ, యశ్దూబే ఆచితూచి ఆడుతూ రెండో వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత రజత్ పటీదార్.. జైన్తో కలిసి 49 పరుగులు జోడించడంతో మధ్యప్రదేశ్ విజయం లాంఛనమైంది. సునాయసంగా గెలిచే మ్యాచ్ను ఆంధ్ర చెత్త బ్యాటింగ్తో చేజార్చుకుంది.
తొలి ఇన్నింగ్స్లో 379 పరుగులు చేసి 151 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆంధ్ర జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకే కుప్పకూలింది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 228 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీరాజ్ (5/26), శశికాంత్ (3/49) రాణించారు. రెండో ఇన్నింగ్స్లో ఊహించని రీతిలో తడబడిన ఆంధ్ర 32.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. అవేష్ఖాన్ (4/24), గౌరవ్ యాదవ్ (3/10) ఆంధ్ర పతనాన్ని శాసించారు. 76 పరుగులకే ఆంధ్ర 9 వికెట్లు కోల్పోయింది.
ఎడమ చేతి మణికట్టులో చీలిక కారణంగా ఫీల్డింగ్కు రాని విహారి (15; 16 బంతుల్లో 3×4) తప్పనిసరి పరిస్థితుల్లో 11వ నంబరులో క్రీజులోకి వచ్చాడు. మూడు బౌండరీలూ రాబట్టాడు. 16 బంతులు ఎదుర్కొన్న విహారి.. పృథ్వీరాజ్ (2 నాటౌట్)తో కలిసి పదో వికెట్కు 17 పరుగులు జోడించాడు. చివరికి స్పిన్నర్ సారాంష్ జైన్ (1/11) బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.