న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతీష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2022లో టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే దుమ్మురేపాడు. రైల్వేస్ జట్టుతో చెన్నై వేదికగా శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్లో కర్ణాటక టీమ్ కెప్టెన్ అయిన మనీశ్ పాండే(121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 156) భారీ శతకంతో చెలరేగాడు. 12 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు. అతనికి తోడుగా క్రిష్ణమూర్తి సిద్ధార్థ్ (221 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక జట్టు 5 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మనీశ్ పాండే ధనాధన్ ఇన్నింగ్స్లో లక్నో ఫ్రాంచైజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు వేదికగా ఇటీవల ముగిసిన మెగా వేలంలో మనీశ్ పాండేను లక్నో టీమ్ రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది. మనీశ్ స్కిల్ గురించి తెలిసిన ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ అతని కోసం పోటీ పడి మరీ తీసుకున్నాడు. 2014 సీజన్ ఫైనల్లో మనీశ్ పాండే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతోనే గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది.
ఇదిలా ఉంటే, కర్ణాటక జట్టుకే ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ (16), రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్ (21) దారుణంగా నిరాశపరిచారు. వీరిద్దరు కర్ణాటక తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగి తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. పడిక్కల్కు ఆర్ఆర్ జట్టు 7.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేయగా, మయాంక్ను పంజాబ్ జట్టు 12 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక సుదీర్ఘ విరామం అనంతరం నేడు(గురువారం) రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. ఇండియా క్రికెట్కు వెన్నుముకగా ఉన్న ఈ మెగా ట్రోఫీకి కరోనా కారణంగా రెండేళ్లు బ్రేక్ పడింది. మూడో వేవ్ నుంచి కాస్త ఉపశమనం లభించడంతో డొమెస్టిక్ క్రికెటర్ల ఎదురుచూపులు ఫలించాయి. బీసీసీఐ పక్కాగా ఏర్పాటు చేసిన బయో బబుల్లో ఈ టోర్నీ మొదలైంది.