న్యూఢిల్లీ: టీమిండియా బౌలింగ్ విభాగంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా తన అక్కసు వెళ్లగక్కాడు. టీమిండియా మేనేజ్మెంట్ పాకిస్థాన్ బౌలింగ్ ప్రణాళికలను కాపీ కొట్టిందన్నాడు. అయినా పాకిస్థాన్ బౌలింగ్ కంటే భారత్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉందన్నాడు. కొత్త ఏడాది భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్, శ్రీలంకలపై భారత్ వన్డే, టీ20 సిరీస్లను సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయాలపై స్పందించిన రమీజ్ రాజా.. భారత్ విజయాన్ని తట్టుకోలేకపోయాడు.
పాక్ బౌలింగ్ను టీమిండియా అనుసరిస్తోందన్నాడు. ఇరు జట్ల పేస్ బౌలింగ్ ఒకేలా ఉందని చెప్పాడు. 'పాక్ బౌలింగ్ అటాక్ను పరిశీలించి.. టీమిండియా తమ బౌలింగ్ అటాక్ను సిద్దం చేసుకుంది. ఈ విషయాన్ని నేను ఎప్పుడో గ్రహించాను. హారిస్ రౌఫ్ మాదిరిగానే ఉమ్రాన్ మాలిక్.. షాహీన్ షా అఫ్రిదిలా అర్ష్దీప్ సింగ్.. ఇక మిడిల్ ఓవర్లలో వసీమ్ జూనియర్ మాదిరిగా హార్దిక్ పాండ్యా బౌలర్లుగా తయారు చేసుకుంది. శివమ్ మావి సపోర్టింగ్ బౌలర్గా సిద్ధం చేసింది. అయితే భారత పేస్ దళం పాక్ కంటే తక్కువే కానీ.. స్పిన్ విభాగం మాత్రం పటిష్ఠమైంది.
స్పిన్ బౌలింగ్ను బలోపేతం చేసుకోవాలని ఎప్పుడూ పాక్ జట్టుకు సూచిస్తూ ఉంటా. ఇక న్యూజిలాండ్ - భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లను చూశా. భారత బౌలింగ్ సాధారణంగా అనిపించింది. కివీస్ ఆందోళనకు గురై సిరీస్ను వదిలేసుకొంది. కానీ, భారత్ను స్వదేశంలో అడ్డుకోవడం అతిపెద్ద సవాలే ' అని రమీజ్ రజా వ్యాఖ్యానించాడు. పీసీబీ చైర్మన్ బాధ్యతల నుంచి వేటుకు గురైన రమీజ్ రాజా.. మళ్లీ కామెంటేటర్ బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాడు. శ్రీలంక, కివీస్ జట్ల మీద వరుసగా వన్డే, టీ20 సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడేందుకు సన్నదమవుతోంది.