న్యూఢిల్లీ: ఐర్లాండ్ పర్యటనకు ఎంపికవ్వడంపై భారత యువ క్రికెటర్ రాహుల్ త్రిపాఠి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నెల 26, 28 తేదీల్లో జరగనున్న రెండు టీ20ల సిరీస్ కోసం చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ... హార్థిక్ పాండ్యా సారథ్యంలోని జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కింది. ఐపీఎల్ 2022 సీజన్లో సత్తా చాటడంతో అతనికి తొలిసారి టీమిండియా పిలుపు అందింది.
ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంపై రాహుల్ స్పందించాడు. 'ఇది నాకు చాలా పెద్ద అవకాశం. కల నిజమైన వేళ. భారత జట్టుకు ఎంపికైనందుకు అమితానందంగా ఉంది. సెలెక్టర్లు నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. వారితో పాటు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక తుది జట్టులో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటా. టీమిండియా తరఫున అత్యుత్తమ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తా' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
కాగా, 2017లో తొలిసారి రైజింగ్ పుణె జట్టు తరఫున ఐపీఎల్లో మెరిసిన రాహుల్ త్రిపాఠి.. తర్వాత కోల్కతా నైట్రైడర్స్ తరఫున నాలుగేళ్లు ఆడాడు. అయితే ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో హైదరాబాద్ కొనుగోలు చేయడంతో ఆ జట్టులో పలు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సారి టోర్నీలో 413 పరుగులు చేసి మంచి ప్రదర్శన చేయడంతో ఇటీవల సౌతాఫ్రికా సిరీస్కు ఎంపిక చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ, అతన్ని ఎంపిక చేయకపోయేసరికి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సెలెక్టర్లను తీవ్రంగా దుయ్యబట్టారు. మరోవైపు రాహుల్ దేశవాళీ క్రికెట్లోనూ మెరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్కు ఎంపికచేశారు. మరి తుది జట్టులో రాహుల్కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.
ఐర్లాండ్ పర్యటనలో భువనేశ్వర్ వైస్కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో సారథిగా వ్యవహరించిన పంత్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. కెప్టెన్ రోహిత్, కోహ్లి సహా ఇంగ్లాండ్తో టెస్టులో ఆడే ఆటగాళ్లెవరూ టీ20 జట్టులో లేరు.