అయితే తిరువనంతపురంలో మ్యాచ్కు ముందు కోల్కతా నుంచి ద్రావిడ్ ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం బాగలేకపోవడంతో తను బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో జరిగే మ్యాచ్కు ద్రావిడ్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ మ్యాచ్లో ద్రావిడ్ అందుబాటులో లేకున్నా పెద్దగా సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వన్డే సిరీస్ భారత్ వశమైంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఆ జట్టు కేవలం 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్లో టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. అయితే కేఎల్ రాహుల్ (64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
లక్ష్యం చిన్నదే కావడంతో ఎక్కడా రిస్క్ తీసుకోకుండా నిదానంగా ఆడుతూ అతను జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే అతను మూడో వన్డేలో ఆడటం అనుమానంగా మారింది. ఈ మ్యాచ్లో భుజం గాయంతో బాధ పడుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ను తీసుకున్నారు. ఇక మూడో వన్డే సమయానికి చాహల్ కోలుకుంటే అతన్ని తీసుకొని, మళ్లీ కుల్దీప్ను పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది.