ఓపెనర్ల ఫ్లాప్ షో..
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. అందరూ ఊహించనట్టే మయాంక్ అగర్వాల్- పృథ్వీ షా ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ ఈ సువర్ణ అవకాశాన్ని ఈ జోడీ వినియోగించుకోలేకపోయింది. మయాంక్(38) కొంత పోరాడినప్పటికీ.. షా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 16 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. 2 ఫోర్లతో దూకుడు కనబర్చిన అతన్ని టీమ్ సౌతి క్లీన్ బౌల్డ్ చేశాడు.
|
హడలెత్తించిన జేమీసన్
ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసిన కైలీ జేమీసన్ ప్రత్యర్ధి బ్యాట్స్మన్ను హడలెత్తించాడు. పిచ్ నుంచి లభించిన స్వింగ్ను సద్వినియోగం చేసుకున్న ఈ యువ బౌ లర్ అరంగేట్ర మ్యాచ్లోనే మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసిస్తున్నాడు.
పుజారా 11.. కోహ్లీ 2
తొలుత ఇండియా నయావాల్ పుజారా(11)ను ఔట్ చేసిన జేమీసన్.. తన మరుసటి ఓవర్లలోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని(2) పెవిలియన్ చేర్చాడు. జేమీసన్ వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ను పుజారా మిడ్ ఆన్ మీదుగా డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి కాస్త బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ వాట్లింగ్ చేతిలో పడింది. కోహ్లీ కూడా ఈ అరంగేట్ర బౌలర్ సేమ్ ఇదే ఔట్ సైడ్ ఔట్ స్టంప్ బాల్కు బోల్తా కొట్టించాడు. ఈ బంతిని తప్పుగా అంచనా వేసిన భారత కెప్టెన్ స్ట్రెయిట్గా భారీ షాట్ ఆడాలని భావించాడు. కానీ అది కాస్త బ్యాట్కు ఎడ్స్ తీసుకొని ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రాస్ టేలర్ చేతిలో పడింది. దీంతో కోహ్లీ(2) నిరాశగా పెవిలియన్ చేరాడు.
విహారీ విఫలం..
40 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో అగర్వాల్ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. పూర్తిగా డిఫెన్స్కు పరిమితమైన ఈ జోడీ.. అవకాశమున్న బంతులను బౌండరీలకు తరలించారు. దీంతో భారత్ 78/3తో ఫస్ట్ సెషన్ బ్రేక్ వెళ్లింది. లంచ్ విరామం అనంతరం మయాంక్ అగర్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన ట్రెంట్ బౌల్ట్ ఈ జోడీని విడదీశాడు. దీంతో 4వ వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారీ(7) తీవ్రంగా నిరాశపరిచాడు. జెమీసన్ బౌలింగ్లో కీపర్క క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
నిలకడగా పంత్.. రహానే
ఈ టూర్ ఆసాంతం బెంచ్కే పరిమితమైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు ఈ మ్యాచ్లో ఎట్టకేలకు అవకాశం దక్కింది. స్పెషలిస్ట్ కీపర్ వృద్దీమాన్ సాహాను కాదని టీమ్మేనేజ్మెంట్ పంత్కు అవకాశం ఇచ్చింది. ఈ యువ వికెట్ కీపర్ సాయంతో రహానే ఇన్నింగ్స్ను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి రాగా.. జడేజా బెంచ్కే పరిమితమయ్యాడు.
|
టేలర్ ‘వందనం'..
కివీస్ మాస్ట్రో రాస్ టేలర్ ఈ మ్యాచ్తో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సంప్రదాయక ఫార్మాట్లో ఈ మ్యాచ్ అతనికి 100వది. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన ఎకైక క్రికెటర్గా చరిత్రకెక్కాడు. భారత్తో జరిగిన టీ20 సిరీస్లోనే టేలర్ పొట్టి ఫార్మాట్లో 100 మ్యాచ్లు పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే.