సమయం ఆసన్నమైంది:
ముంబై ఇండియన్స్ ప్రిపరేషన్ పూర్తయిందని, ఇక బరిలోకి దిగడమే తరువాయి అని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. చెన్నైతో జరిగే తొలి మ్యాచ్కు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు హిట్మ్యాన్ చెప్పాడు. తాజాగా రోహిత్ ఇన్స్టాగ్రామ్లో పలు ఫొటోలు పోస్టుచేసి ఇదే విషయాన్ని తెలిపాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని తమ ప్రాక్టీస్ ముగిసిందని, ఇక తొలి మ్యాచ్లో తలపడేందుకు సమయం ఆసన్నమైందని రోహిత్ పేర్కొన్నాడు.
వినోదం అందించేందుకు సిద్ధం:
'కెప్టెన్స్ కార్నర్' అనే పేరుతో ముంబై ఇండియన్స్ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విడుదల చేసింది. అందులోనూ హిట్మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ఈ సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా. క్రికెట్ అభిమానులకు వినోదం అందించేందుకు సిద్ధంగా ఉన్నా. కొన్ని నెలలుగా ఆటగాళ్లెవ్వరూ క్రికెట్ ఆడలేదు. దీంతోదుబాయ్ వచ్చాక కొద్ది రోజులు గాడిలో పడేందుకు ప్రయత్నించాం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ మ్యాచ్లతో తిరిగి ఫామ్లోకి వచ్చాం. ప్రిపరేషన్ పూర్తయింది పూర్తయింది' అని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
ఓపెనర్గా బరిలోకిదిగుతా:
ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు అందరూ బయో బుడగలో ఉండాల్సిన అవసరం రావడంతో తమ జట్టు యాజమాన్యం అత్యుత్తమ సౌకర్యాలు ఏర్పాటు చేసిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. గతేడాదిలాగే ఈసారి కూడా తాను ఓపెనింగ్ బ్యాట్స్మన్గా దిగుతానని, అలాగే జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే టాప్ ఆర్డర్లో ఆడటం అనేది తనకు ఇష్టమని రోహిత్ తెలిపాడు. గత ఏడాది టోర్నమెంట్లో రోహిత్ 15 మ్యాచ్ల్లో 28.93 సగటుతో 405 పరుగులు చేసాడు.
నాలుగుసార్లు విజేతగా:
అనంతరం తమ జట్టు విజయానికి కారణమైన తెర వెనుక వ్యక్తులను ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పరిచయం చేశాడు. కాగా రోహిత్ ఇప్పటికే ఆ జట్టును నాలుగుసార్లు విజేతగా నిలిపాడు. ఇప్పుడు యూఏఈలోనూ మరోసారి టైటిల్ విన్నర్గా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్లో హిట్మ్యాన్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి మరి!